మంగళగిరిలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇవాళ ఒక్కరోజు పవన్ దీక్షకు దిగారు. సాయంత్రం దీక్ష ముగిసిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఉంటే.. ఆ ఎమ్మెల్యేను కూడా వైసీసీ లాక్కుందని.. తాను వెళ్లి కేంద్రంతో మాట్లాడానని.. 151 మంది ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు పెట్టుకుని వైసీపీ కేంద్రాన్ని అడిగితే సమస్య పరిష్కారం కాదా అని ప్రశ్నించారు పవన్.
ముఖ్యంగా వైసీపీ నాయకులను చొక్క పట్టుకొని నిలదీయకపోతే ఈ రాష్ట్ర, విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్య పరిష్కారం కాదు అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్య ఇది అందరూ కలిసి పోరాడాలి. తప్పు కేంద్రానికి కాదు.. అడిగే పద్దతిది. అమరావతి రాజధాని అని బీజేపీ ఒప్పుకుంది. మొన్న అమిత్ షా తిరుపతిలో కూడా అమరావతినే రాజధాని అని చెప్పారని పవన్ కల్యాణ్ గుర్తు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని పవన్ పేర్కొన్నారు. చట్టసభల్లో బలం ఉంది. వైసీపీకి, పార్లమెంట్లో వైసీపీకి బలం ఉన్నదని.. వైసీపీ బాధ్యత తీసుకోవాలని పవన్ పేర్కొన్నారు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని పవన్ సూచించారు.
స్టీల్ ప్లాంట్కు న్యాయం జరగాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అధికార పార్టీ ఓట్లు వేయించుకుందని.. ప్రతీ వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలను నిలదీసి.. స్టీల్ ప్లాంట్ విషయంపై అడగాలన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆవిర్భావానికి గుంటూరు జిల్లానే కారణమని తెలిపారు పవన్కల్యాణ్. ఉమ్మడి ప్రయోజనాల కోసం అందరం ఏకతాటిపైకి రాకుంటే సమస్యలు పరిష్కారం కావు అని స్పష్టం చేసారు. స్టీల్ ప్లాంట్ అప్పు 22వేల కోట్లు.. అప్పు ఉంటే అమ్మేస్తాం అనే వాదనే కరెక్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6లక్షల కోట్ల అప్పు ఉందని.. ఆ రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారా..? ఏపీని కూడా ప్రయివేటీకరణ చేస్తారా అని ప్రశ్నించారు. వైసీపీకి నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను. ప్రజాక్షేత్రం నుంచి మేము పారిపోము.. ధైర్యంగా నిలబడతాం. ఇన్ని దశాబ్దాలుగా కేవలం కొంత మందికే రాజకీయ లబ్ధి కాకుండా.. అందరికీ అధికారం ఇవ్వగలిగేందుకు జనసేన పని చేస్తుందని తెలిపారు.