చైనా పేరు వింటే మొదటగా గుర్తుకు వచ్చేది జనాభా.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంలో చైనా మొదటి స్థానంలో ఉంది. జనాభా ఎంత ఉన్నా అభివృద్ధిలో మాత్రం దూసుకువెళ్తోంది. నిబంధనలు, ఆంక్షలు అమలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఏదైనా పాలసీని కఠినంగా అమలు చేయడంలో చైనా ముందుంటుంది. ఇలాంటి క్రమంలో చైనాలో జనాభా నియంత్రణ కఠినంగా అమలు చేశారు. భారీగా పెరుగుతున్న జనవిస్పోటానాన్ని తగ్గించేందుకు అనేక నిబంధనలను తీసుకువచ్చిన చైనా ఇప్పుడు జనాభా పెంచడానికి కొత్త పాలసీలను తీసుకువస్తోంది.
దీనికి కారణం చైనీయులు పిల్లల్ని కనాలన్న విషయాన్ని మర్చిపోతున్నారట. ఇదే పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా సాగుతోంది. దీంతో డ్రాగన్ కంట్రీలో కొత్త సమస్యలకు దారి తీస్తున్నాయి. గత నిబంధనల కారణంగా దేశంలో యువత సంఖ్య తగ్గిపోవడం ప్రారంభమైంది. దీంతో రానున్న రోజుల్లో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని గుర్తించిన డ్రాగన్ ప్రభుత్వం నివారణ చర్యలకు పూనుకుంది. ఈ చర్యల్లో భాగంగా ప్రస్తుతం ` జిలిన్ ` ప్రావిన్సు లో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం ప్రకారం పెళ్లైన వారు పిల్లల్ని కనాలనుకుంటే 25 లక్షల రూపాలయ మొత్తాన్ని అప్పుగా ఇస్తామని అక్కడి స్థానిక ప్రభుత్వం ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీని ద్వారా జంటలను సంతానం కనే దిశగా ప్రోత్సహిస్తోంది. దీంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించే దంపతులకు ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే.. వారి వ్యాపారాలకు విధించే పన్నుల్లో రాయితీతో పాటు మినహాయింపులు కూడా ఇస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
ఈ విధంగా ప్రజలను ప్రోత్సహించడం ద్వారా జనాభా లో మార్పు వస్తుందని అంచనా వేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో మిగతా ప్రావిన్సులల్లో కూడా జిలిన్ ప్రావిన్స్లో ప్రవేశపెట్టిన ఇలాంటి పథకాలు, ప్రోత్సాహకాలు తీసుకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒక్కప్పుడు పిల్లల్ని కంటే చర్యలు తీసుకున్న చైనా ఇప్పుడు పిల్లల్ని కనమని ప్రోత్సహించే పరిస్థితికి వచ్చింది.