తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరు నడుస్తోంది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పోటాపోటిగా పావులు కదుపుతున్నారు. 2022 లో కూడా బీజేపీపై టీఆర్ఎస్ పోరు తీవ్రతరం చేస్తుందని స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా 2022 లో ప్రతి నెలా ఓ కార్యక్రమం చేపడుతుందని, వాటిల్లోని కొన్నింటిల్లో కేసీఆర్ కూడా పాల్గొంటారని ఓ ఇంగ్లీష్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఇప్పటికే వరి కొనుగోలు అంశంలో కేసీఆర్ కూడా పాల్గొన్నారు. అయితే, తెలంగాణ పట్ల బీజేపీ వివక్ష చూపుతుందనేది ప్రధాన అంశంగా మారుతుంది.
అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలు కుల జనగణన చేయాలని బీసీ సంఘాలతో కలిసి టీఆర్ఎస్ కూడా పోరాడుతుందనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే చేనేత వస్త్రాలపై జీఎస్టీ పెంచడంపై కేంద్రానికి వ్యతిరేకంగా కేటీఆర్ లేఖలు కూడా రాస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై, కేంద్రం రాష్ట్రానికి ఏం చేసిందనే దానిపై బీజేపీని టీఆర్ఎస్ వెంటాడుతుంది.. అవసరం అయితే వేటాడుతుందని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, వచ్చే ఏడాదిలో కూడా ఇది కొనసాగుతుందని అంటున్నారు. అయితే, గతంలో బీజేపీతో స్నేహం చేసిన చంద్రబాబు 2019 ఎన్నికలకు ముందు ధర్మపోరాటానికి తెరలేపారు.
ఇప్పుడు అదే రీతిలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ కూడా అదే పద్ధతిలో నడుస్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
అయితే, బీజేపీ పై ధర్మపోరాటానికి దిగిన బాబు బొక్కబోర్లా పడ్డారు. ఈ క్రమంలో కేసీఆర్ కు కూడా ఇలానే జరుగుతుందని బీజేపీ భావిస్తోంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ కేసీఆర్ ముందస్తుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీ పై కేసీఆర్ ఇప్పటి నుంచే ధర్మపోరాటాన్ని మొదలు పెట్టారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందని ముందే ఊహించిన కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పై ఇప్పటి నుంచే విమర్శనాస్త్రాలు సందిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు 2022 కీలక ఏడాది మారుతుందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.