కరోనా : రాజధానిలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు
తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మొత్తం 64,744 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 2,295 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదు అయిన కేసుల సంఖ్య 6,89,751 కు చేరుకున్నది. తాజాగా వైరస్ బారిన పడిన ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4, 039 కి చేరింది. అయితే కరోనా బారిన పడి 278 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 9,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో నమోదు అయిన మొత్తం కేసుల్లో 1,452 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. ఆ తరువాత మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో 232 మందికి వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 218, హన్మకొండలో 54, సంగారెడ్డి 50, నిజామాబాద్, ఖమ్మం 29 కేసుల చొప్పున కొత్త కేసులు వెలుగు చూసాయి. నిన్నటితో పోల్చితే దాదాపుగా అన్నిజిల్లాలలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం కొవిడ్ వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతోంది. కాగా కరోనా పరీక్షలు నిర్వహించిన కేసుల్లో ఇంకా 10,336 మందికి చేసిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
అయితే దేశంలో కరోనా సునామిలాగే దూసుకెళ్లుతుంది. రోజు వ్యవధిలోనే రెట్టింపు వేగంతో కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న గురువారం ఒక్కరోజే 1,17,100 మందికి కరోనా వైరస్ సోకింది. గత ఏడాది జూన్ 07 తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరొక 302 మంది మృత్యువాతపడ్డారు. 30,386 మంది కొవిడ్ను జయించారు. దేశంలో రోజువారి పాజిటివిటి రేటు అంతకంతకూ పెరుగుతున్నది. ప్రస్తుతం 7.74 శాతంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.