చంద్రబాబుపై వైసీపీలో కొత్త డిస్కర్షన్...!
టీడీపీ అధినేత చంద్రబాబు విషయం మరోసారి వైసీపీలో చర్చకు వచ్చింది. తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన నేపథ్యంలో టీడీపీ కార్యకర్త చంద్రయ్య మరణించారు. ఈ కుటుంబాన్ని పరామర్శించేం దుకు చంద్రబాబు అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ఏకంగా.. చంద్రయ్య పాడెను చంద్రబాబు మోశారు. దీనికి సంబందించిన ఫొటోలు, వీడియోలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మూడు సార్లు సీఎంగా చేసిన నేత, విజన్ ఉన్న నాయకుడు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత.. అనేక మెట్లు దిగి మరీ .. పార్టీ కార్యకర్త పాడె మోశారంటూ.. పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమవుతోంది.
అసలు చంద్రబాబు ఈ సింపతీ కోసమే.. పాడె మోశారనే వాదన కూడా వస్తోంది. అయితే.. దీనిపై వైసీపీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయంగా దిగజారారా ? అనే అంశంపై వైసీపీ నాయకులు చర్చించుకోవడం విశేషం. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన బంధువు, ఎన్టీఆర్ కుమారుడు, మాజీ మంత్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు కూడా సీఎం చంద్రబాబు.. ఇలానే చేశారు. హరికృష్ణ పాడె మోశారు.
దీనివల్ల నందమూరి కుటుంబం అంతా తనవెంటే ఉంటుందని.. పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు పనికి వస్తుందని అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. తదుపరి జరిగిన ఎన్నికల్లో ఈ వ్యూహం ఎక్కడా పనిచేయలేదు. ఇక, ఇప్పుడు ఇదే వ్యూహంతో చంద్రబాబు పాడె మోశారని.. వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. మరి నిజానికి.. ఇది కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ ఇస్తుంది? అనేది చర్చగా మారింది.
వాస్తవానికి కార్యకర్తలను ఓన్ చేసుకోవాలని అనుకుంటే.. ఇలా పనులు చేయాల్సిన అవసరం లేదని.. వారిలో భరోసా నింపేందుకు ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలు పెట్టుకుంటే చాలని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు.. ఒక నాయకుడిగా కుటుంబానికి అండగా నిలిస్తే.. తప్పులేదని..కానీ, ఇలా చేయాల్సిన అవసరం లేదని పలువురు పేర్కొంటున్నారు.