ఏంట్రా ఇది : విరాళాలు కావలెను? యూపీ బీపీ
ఓట్లు నిర్ణయిస్తాయి
ఓట్లు మరియు నోట్లు
మధ్య వైరం కుదరనంత వరకూ
నిజాలు అన్నవి దేవుడి ఖాతాలో ఉంటాయి
అందుకు నిదర్శనం ఉత్తర ప్రదేశం....
రాజకీయం అనగానే ఇప్పుడిక ఉత్తర ప్రదేశ్ వైపు చూడాలి.ఎందుకంటే అక్కడ గెలుపు మోడీ గెలుపు.. అక్కడ ఓటమి మోడీ ఓటమి అన్నంతగా పరిణామాలు తయారవుతున్నాయి.ఈ దశలో ఎన్నికల ఖర్చు వాటి వివరాలు అన్నవి కాస్త అనధికారికంగా వెల్లడి అయినా అవన్నీ ఆశ్చర్యానికి గురిచేసేవే! ఎన్నికల్లో ఖర్చు నియంత్రణపై ఓ వైపు సంబంధిత అధికార వర్గాలు నెత్తీ నోరూ మొత్తుకుంటుంటే పార్టీలు మాత్రం తమ ప్రచార మార్గాలను ఆధునికీకరించి డిజిటలైజ్డ్ వెర్షన్లో సాగించి కొత్త పద్ధతుల పేరిట కోట్లకు కోట్లు ఖర్చు చేస్తూనే మధ్యలో ఉచితాల వివరాలు కూడా అందిస్తూ సంబంధిత పథకాలపై కూడా ప్రజలకు ప్రేమ పుట్టేలా చేస్తుండడం ఇప్పటి జమానాలో ప్రత్యేకత.
ఉత్తరప్రదేశ్ రాజకీయా్లలో మరికొన్ని పలుకులు వినిపిస్తున్నాయి.మరింత ఆసక్తిదాయక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీలే అభ్యర్థుల నుంచి విరాళాలు వసూలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం! రానున్న ఎన్నికలు ఎంత కాస్ట్లీవో అన్న క్లారిటీ ఈ పాటికే పార్టీలకు వచ్చేసింది. ఐదు రాష్ట్రాలకు కలిపి ఎలా లేదన్నా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తేలిపోయింది.అంటే ఒక్కో రాష్ట్రానికి ఏడు వందల కోట్ల రూపాయల చొప్పున ఖర్చు కానుందని ఓ అంచనా! ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ మొత్తం పెరిగినా పెరుగుతుంది కానీ తగ్గేదే లే అన్నది సుస్పష్టం అవుతున్న పరిణామాలకు సంకేతం.
ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ఖర్చకు ఫండ్ ఇవ్వాల్సిన పార్టీలే గేర్ మార్చాయి.రివర్స్ గేర్ వేశాయి. అభ్యర్థుల నుంచి బీజేపీ అయితే నలభై లక్షలు, బీఎస్పీ అరవై లక్షలు, ఎస్పీ నేతృత్వంలోని కూటమి యాభై లక్షలు, కాంగ్రెస్ ఆరు లక్షలు చొప్పున వసూలు చేస్తున్నాయని ప్రధాన మీడియా చెబుతోంది. విరాళాల రూపంలో పార్టీలు అందుకునే మొత్తాలు 630 కోట్ల రూపాయలుగా ఉండవచ్చని ఓ అంచనా! ఏ విధంగా చూసుకున్నా ఒక్కో అభ్యర్థి తమ గెలుపునకు సంబంధించి నలభయి లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఎన్నికలు ముగిసే నాటికి యూపీ లో ఖర్చుకు ఇంకా అంతూపొంతూ అన్నదే ఉండదని కూడా ప్రధాన మీడియా ఘోషిస్తోంది. అంటే ఇంతటి భారీ స్థాయిలో ఖర్చు చేస్తేనే కానీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కానీ మరొకటి కానీ లేవని తేలిపోయింది.