పవన్ పోటీ తిరుపతి నుంచేనా..? లక్షమెజార్టీ కూడా ఫిక్స్ అయిందా..?
2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ తిరుపతి విభాగం కీలక తీర్మానం చేసింది. తిరుపతిలో పవన్కల్యాణ్ సొంత సామాజిక వర్గానికి మెజార్టీ ఉంది. ఆ ఓట్లన్నీ గుంప గుత్తగా ఆయనకే పడితే గెలుపు గ్యారెంటీ. అయితే సామాజిక వర్గంలో కూడా పార్టీల వారీగా ఓట్లు చీలిపోతాయనేది బహిరంగ రహస్యం. కానీ నేరుగా పవన్ పోటీ చేస్తే కచ్చితంగా ఈసారి అందరూ ఆయననే బలపరిచే అవకాశముందనేది జనసేన స్థానిక నేతల అభిప్రాయం. దీంతో వారంతా కలసి ఈ తీర్మానం చేశారు. గతంలో చిరంజీవి పోటీ చేసినప్పుడు కూడా అదే జరిగిందని, ఇప్పుడు పవన్ పోటీ చేస్తే కచ్చితంగా అందరూ జనసేనకే ఓటు వేస్తారని నమ్మకంగా చెబుతున్నారు.
గతంలో తిరుపతిలో ప్రజారాజ్యం విజయాన్ని జనసేన నేతలు సెంటిమెంట్ గా భావిస్తున్నారు. చిరంజీవి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కారణం అయిన తిరుపతి నియోజకవర్గం నుంచే ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని, ఆ సెంటిమెంట్ కొనసాగుతుందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో పవన్కల్యాణ్ భీమవరం, గాజువాక రెండు చోట్ల బరిలో నిలిచారు. కానీ రెండు చోట్ల ఆయన ఓడిపోయారు. ఈసారి మాత్రం ఒకేచోట నిలబడాలని అనుకుంటున్నారు. ఇటీవల ఉత్తరాంధ్రలో పవన్ పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తిరుపతి జనసైనికులు మాత్రం పవన్ కల్యాణ్ తమ ప్రాంతానికి రావాలని, కచ్చితంగా గెలిపించుకుంటామని అంటున్నారు.