అమరావతి : ఇంత చెప్పిన తర్వాత పవన్ కు ఎవరైనా ఓట్లేస్తారా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. అదేమిటంటే తాను అందరికన్నా అధికుడననే భావనలో ఉంటారు. ఎందులో అధికుడో, ఎందులో ఉత్తముడో మాత్రం పాపం ఆయనకే తెలీదు. తాజాగా మంగళగిరి పార్టీ ఆఫీసులో సమావేశంలో మాట్లాడిన మాటలే ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. మీటింగులో పవన్ మాట్లాడుతు తాను అధికారం కోసం జనసేన పార్టీ పెట్టలేదన్నారు. ఒక తరాన్ని మేల్కొలిపేందుకు, బాధ్యతను గుర్తుచేయటానికే పార్టీ పెట్టినట్లు చెప్పారు.
ఇదే పవన్ ఆమధ్య మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వమే వస్తుందని పదే పదే బల్లగుద్దకుండా చెప్పారు. తనను రెండుచోట్ల ఓడించిన జనాలకు శాపనార్ధాలుపెట్టారు. తనను జనాలు ఓడించి తప్పుచేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఓట్లేసి అధికారం అప్పగించాలని కోరారు. ఒక్కసారి ఛాన్సిస్తే జనసేన పార్టీ పాలన ఎలాగుంటుందో చూపిస్తానని చెప్పారు. మరి పవన్ అధికారం కావాలని అప్పుడు మాట్లాడింది కరెక్టా లేకపోతే ఇపుడు మాట్లాడింది కరెక్టా ?
ఒకమాట మీద స్ధిరత్వంలేని పవన్ కు ఏ విషయంలో కూడా పరిజ్ఞానం లేదని అర్ధమైపోయింది. ఈరోజు మాట్లాడిన మాట మళ్ళీ రేపు మాట్లాడరు. ఈ రోజు మాట్లాడిన మాటలకు విరుద్ధంగా రేపు మాట్లాడుతారు. అంటే మాటమీద స్ధిరత్వంలేదు, విషయపరిజ్ఞానం లేదన్న విషయం జనాలకు అర్ధమైపోయే రెండు నియోజకవర్గాల్లోను ఓడిగొట్టింది. పదవి మనల్ని వెతుక్కుంటు రావాలి కానీ మనం పదవి వెంటపడటం ఏమిటి ? అనే ప్రశ్న విచిత్రంగా ఉంది. అసలు పదవుల వెంటపడుతున్నదెవరు ? ముఖ్యమంత్రయిపోతాను, అధికారంలోకి వచ్చేస్తానని పదే పదే చెబుతున్నదే పవన్ కదా.
అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు, పార్టీ పెట్టలేదని ఎవరైనా చెబితే జనాలు పిచ్చోడిని చూసినట్లు చూస్తారు. అధికారం కోసం, పదవుల కోసం కాకపోతే ఎవరైనా రాజకీయాల్లోకి ఎందుకొస్తారు ? జనాలను పవన్ పిచ్చోళ్ళని అనుకుంటున్నారు. అందుకనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పవన్ వైఖరి ముందే అర్ధమైపోయే జనాలు జనసేనకు ఓట్లేయటంలేదని అర్ధమైపోతోంది.