నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.నగరంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఏజెంట్లు పట్టుబడడం, టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉగ్రదాడుల నేపథ్యంలో దీనిలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. నేటి నుంచి జులై 6 వరకు ముమ్మర తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో అప్పటివరకు సందర్శకులకు అనుమతి నిరాకరించడంతో పాటు, అన్ని రకాల పాసులు రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల వద్ద అక్టోపస్ బలగాలను మోహరించారు. అంతర్గత భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయానికి ఉన్న ప్రధాన రహదారుల్లో పోలీసు బలగాలను దించారు. సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలతోపాటు రక్ష సెక్యూరిటీ దళాలతో భద్రతను పెంచారు. ప్రధాన ద్వారం వద్ద వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే నగరంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. షాపింగ్ మాల్స్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్, సైబర్టవర్ సహా మరికొన్ని ప్రదేశాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ లో మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ ప్రణాళికలు రూపొందించినట్టు బహిర్గతమైన వేళ, స్పెషల్ పార్టీ బృందాలు, పోలీసులు నగరాన్ని జల్లెడ పడుతున్నాయి. పలు కూడళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నాయి.