ఆ డైరెక్టర్ ఎంబీయే కాదు.. కనీసం ఎనిమిది కూడా పాసవ్వలేదు...!!
‘ఫ్రీడం 251’ పేరిట గతేడాది ఫిబ్రవరిలో రింగింగ్ బెల్స్ సంస్థ పెద్దఎత్తున ప్రచారం చేసింది. దీనిపై అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తం 25 లక్షల మంది ఈ ఫోన్ కోసం రిజిస్టర్ చేసుకోగా అందులో కేవలం 72 వేల మందికే ఫోన్లు అందజేశారని పోలీసులు తెలిపారు. మిగిలిన వారందరికీ డబ్బులు ఎగ్గొట్టారని, దీనిపై త్వరలో కేసు నమోదు చేస్తామని తెలిపారు.
ప్రపంచంలోనే తొలిసారిగా రూ.251కే స్మార్ట్ఫోన్ అందిస్తామంటూ దేశం దృష్టిని ఆకర్షించిన రింగింగ్బెల్స్ సంస్థ డైరెక్టర్ మోహిత్ గోయల్ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రూ.16లక్షల మేర రింగింగ్ బెల్స్ సంస్థ తమకు చెల్లించాలంటూ ఆయామ్ ఎంటర్ప్రైజెస్ చేసిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి పలు నిజాలను రాబట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు.
రింగింగ్ బెల్స్కు చెందిన లింక్డ్ఇన్ వెబ్సైట్లో అమిటీ యూనివర్శిటీలో ఎంబీఏ చేశానని పేర్కొన్న మోహిత్ తాను చదివింది కేవలం ఎనిమిదో తరగతి అని చెప్పాడు. అది కూడా పాసవ్వలేదని పేర్కొన్నాడు. తాను ఇంగ్లిషులో మాట్లాడేందుకు ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్స్ చేశానని పేర్కొన్నాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదొక్కటే కాదని ఈ తరహా కేసులు మరిన్ని అతడిపై ఉన్నాయని, వాటన్నింటిపైనా విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.