మన తెలుగు నేలపై ఏదైనా పండుగ వస్తుందంటేనే దాని వెంటనే వివాదాలూ వస్తున్నాయి. ఏ పండుగ కచ్చితంగా ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై పండితుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా మారుతోంది. ఆ మధ్య పుష్కరాల సమయంలోనూ ఇలాంటి వివాదమే వచ్చింది. ఎవరి విశ్వాసాలను బట్టి వారు జరుపుకున్నారు.
కానీ ఇలాంటి వాటి వల్ల సామాన్య జనం ఫుల్లుగా కన్ ఫ్యూజన్లో పడిపోతున్నారు. మళ్లీ ఇప్పుడు ఉగాది పండుగ కూడా అలాంటి పేచీనే వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే శ్రీనివాస గార్గేయ అనే పండితుడు విజయవాడలో అగ్గి ప్రారంభించేశారు. దృగ్గణితం ప్రకారం మార్చి 28వ తేదీన శ్రీ హేమలాంబ నామ సంవత్సర ఉగాది జరుపుకోవడమే శాస్త్రీయమని ఆయన అంటున్నారు.
అసలు పంచాంగాలు రెండు గణిత శాస్త్రాలను పాటిస్తున్నాయని.. అందువల్లనే ఇలాంటి తేడాలు వస్తున్నాయని గార్గేయ చెబుతున్నారు. ప్రస్తుతం పంచాంగాలలో రెండు రకాలు ఉన్నాయని అందుకే పండుగల తేదీలలో వ్యత్యాసాలు వస్తున్నాయని ఆయన వివరిస్తున్నారు. దృగ్గణితం, పూర్వ గణితం అనే రెండింటి మధ్య తేడాలున్నాయని గార్గేయ చెబుతున్నారు.
సాధారణంగా ఇలాంటి వివాదం వచ్చినప్పుడు భారత ప్రభుత్వం ఆమోదించిన దృగ్గణితాన్నే ప్రామాణికంగా తీసుకోవాలట. ఎందుకంటే.. కంటికి ప్రత్యక్ష ఋజువుకు, ప్రత్యక్ష ప్రామాణికంగా భారత ప్రభుత్వం ఆమోదించిన దృగ్గణితమే నిలుస్తుందట. ప్రత్యక్ష ఋజువుకు నిలబడని గణితాన్ని పూర్వగణితం అంటారట. ఈ గణితం ప్రకారం చెప్పే లెక్కలు ఖగోళ నక్షత్రశాలలో సైతం తప్పుతున్నాయట.
అందుకే వాస్తు, జ్యోతిష పండితులంతా దృగ్గణితం ప్రకారమే లెక్కలు వేయాలని గార్గేయ చెబుతున్నారు. అలా లెక్కలు వేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తున్నాయట. కానీ తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా తిరుమల తిరుపతి దేవస్థానములు పాటించే పూర్వగణితం ద్వారానే పండుగల తేదీలు నిర్ణయిస్తున్నారట. అలా కాకుండా తెలుగు రాష్ట్రప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన దృగ్గణితాన్నే లెక్కలోకి తీసుకుంటే ఈ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదట.
దృగ్గణితం ప్రకారం లెక్కలు వేస్తే మార్చి 28వ తేదీన ఉగాది వస్తుందట. అదే రోజు ఉగాది జరుపుకుంటే మంచిదంటున్నారు శ్రీనివాస గార్గేయ. మరి ఈ శ్రీనివాస గార్గేయ ప్రతిపాదనలపై ఇతర పండితులు ఎలా స్పందిస్తారో.. చివరకు దేన్ని ప్రామాణికంగా పాటిస్తారో.. కొన్నిరోజులు ఆగితే కానీ ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.