ఏపీలో వచ్చే ఎన్నికలు మరో 20 నెలలు ఉండగానే అప్పుడు పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోతోంది. ఇప్పటికే విపక్ష వైసీపీ నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి వైసీపీలోకి జంపింగ్లు జరుగుతున్నాయి. ఈ జంపింగ్ల పర్వంలో అధికార టీడీపీ వైసీపీపై బాగా పై చేయి సాధించింది. ఇక ఏపీలో రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యం లేకుండా ఉన్న కొందరు సీనియర్ నాయకులు, మోడువారిన కాంగ్రెస్లో ఉన్న మాజీ మంత్రులు ఇప్పుడు తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం కొత్త దారులు వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నారు..
ఈ క్రమంలోనే కడప జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఇప్పుడు వైసీపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. మైదుకూరు నుంచి వరుసగా విజయాలు సాధించారు డీఎల్.రవీంద్రారెడ్డి. మాజీ మంత్రి అయిన డీఎల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డికి బద్ధ శత్రువుగా ఉండేవారు. వైఎస్కు, డీఎల్కు అస్సలు పొసిగేది కాదు. వైఎస్ మరణాంతరం కూడా ఆ ఫ్యామిలీతో డీఎస్ కయ్యానికి కాలుదువ్వారు. జగన్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి వైసీపీ స్థాపించాక తనతో పాటు తన తల్లి విజయలక్ష్మి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో డీఎల్ కాంగ్రెస్ నుంచి జగన్పై పోటీ చేస్తానని ముందునుంచే రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. ఆ ఎన్నికల్లో డీఎల్ జగన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు.
అలా వైఎస్ ఫ్యామిలీతో ముందునుంచి ఉప్పునిప్పుగా ఉండే ఆయన కొద్ది రోజులుగా వారితో టచ్లో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా డీఎల్ వైసీపీ అభ్యర్థి వైఎస్.వివేకానందరెడ్డికి తన మద్దతు ఇచ్చారు. ఇప్పుడు జగన్ పాదయాత్ర సందర్భంగా ఆయన వైసీపీలో చేరేందుకు ముహూర్తం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏదేమైనా వైఎస్, ఆయన తనయుడు జగన్లను విమర్శించిన డీఎల్ ఇప్పుడు అదే జగన్ చెంతకు చేరుతుండడం విశేషం.