జనసేనాని పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికలపై క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటి వరకు ఆయన ఏపీలోనే తన పార్టీని బరిలోకి దింపుతారా? తెలంగాణలో పోటీ చేయరా? బరిలోకి దిగితే.. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు? వంటి అనేక కీలక విషయాలపై అందరికీ ఎన్నో సందేహాలు ఉన్నాయి. అయితే, పవన్ వీటిపై ఏనాడూ స్పందించింది లేదు. ప్రస్తుతం పార్టీ నిర్మాణమే తప్ప తనకు మరో పనిలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ పరీక్షలు, ఇంటర్వ్యూలు పెట్టి కేడర్ను పోగేశారు.
ఇక, తెలంగాణలోనూ నేతలను నియమించారు. అయితే, తాజాగా 2019 ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది? ఏపీ, తెలంగాణల్లో ఎన్ని స్థానాలకు పోటీ చేసేదీ వివరించి ఒక్కసారిగా బాంబు పేల్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 175 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని పవన్ స్పష్టత నిచ్చారు. తమకు బలం ఉన్న నియోజక వర్గాల్లోనే బరిలో దిగుతామని చెప్పారు. జనసేన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పవన్ ఈ ప్రకటన చేశారు. మన బలం 175 ఉంటే 175 స్థానాలకే పోటీ చేద్దామని., తెలంగాణ సహా అన్ని చోట్ల పోటీ చేద్దామని., బలం ఎంతో అంతే చేద్దామని చెప్పారు.
2019 ఎన్నికల్లో 175 స్థానాలకు పోటీ చేయాలని పవన్ స్పష్టత నివ్వడంతో వాటిలో ఏ నియోజక వర్గాలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీతో జట్టు కడతారు అనేది ఉత్కంఠగా మారింది. ఏపీ విషయానికి వచ్చేసరికి చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లాల్లోనే ఎక్కువగా పవన్ పార్టీ పోటీ చేసే అవకాశాలున్నాయి. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పవన్ పొత్తు పెట్టుకోరని అర్ధమవుతోంది.
గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చిన పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనే బరిలోకి దిగుతారని అందరూ భావించారు. తెలుగుదేశం పార్టీ కూడా పవన్ పట్ల సానుకూలంగా ఉంది. పవన్ లేవనెత్తే సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రయత్నించింది. అయితే, ప్రస్తుత పవన్ ప్రకటనను బట్టి.. రాబోయే రోజుల్లో జనసేన గమ్యం.. గమనం.. డిఫరెంట్గా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు.