ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తయిపోయింది. ఈ క్రమంలో ఆయన తన ప్రభుత్వానికి ఢోకా లేదని, ప్రజలు తమ వెంటే ఉన్నారని, ఉంటున్నారని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో టీడీపీకి ఆదరణ పెరుగుతోందని చెప్పుకొంటున్నారు. సంతృప్త స్థాయి కూడా పెరుగుతోందని అంటున్నారు. అయితే, బాబు వ్యాఖ్యలకు క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల మహిళలు చెబుతున్న మాటలకు పొంతన లేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఉవ్వెత్తున సాగుతున్న విషయం తెలిసిందే. ఈయన పాదయాత్రకు జనాలు రావడం లేదని, వచ్చిన, వస్తున్న వారంతా కేవలం వైసీపీ కార్యకర్తలు నేతలేనని అధికార పార్టీ టీడీపీ నేతలు, సీఎం చంద్రబాబుసైతం ఎద్దేవా చేస్తున్నారు.
కానీ, జగన్ పాదయాత్రకు సంబంధించి క్షేత్రస్తాయిని పరిశీలిస్తుంటే మాత్రం దీనికి విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. నేతల మాట అటుంచి మహిళలు ఎక్కువ సంఖ్యలో జగన్ను చట్టుముడుతుండడం గమనార్హం. అంతేకాదు, తమ కష్టాలు ఎక్కువగా చెప్పుకొంటున్నవారు మహిళే కావడం కూడా గమనార్హం. ఇటీవల చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో నిర్వహించిన జగన్ పాదయాత్రకు కూడా మహిళలు పోటెత్తారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను జగన్కు ఏకరువు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ మాట్లాడుతూ.. 2014 ఎన్నికలకు ముందు చేసిన చంద్రబాబు అండ్ టీడీపీ నేతలు విస్తృతంగా చేసిన ప్రచారాన్ని వీడియో రూపంలో వివరించింది.
``నేను మీ పెద్దకొడుకును. మీరు నన్ను గెలిపిస్తే.. మీ ఇంట పెద్ద కొడుకును గెలిపించినట్టే. మీ సమస్యలు నేరు తీరుస్తా. పెద్ద కొడుకుగా ప్రతి తల్లినీ ఆదుకుంటా`` అంటూ సెంటిమెంట్ రంగరించి చేసిన బాబు ప్రచారాన్ని ఆమె వినిపించింది. అనంతరం సదరు మహిళ మాట్లాడుతూ.. బాబు పెద్దకొడుకుగా వస్తానంటే.. తాను తన కుటుంబంలోని 50 మందికి చెప్పి బలవంతంగానైనా సరే వారితో టీడీపీకి ఓట్లు వేయించానని, కానీ.. ఇప్పటి వరకు ఎలాంటి సమస్యనూ పరిష్కరించలేదని ఆమెవాపోయింది. అంతేకాదు, తమ సమస్య చెప్పుకొనేందుకు ఉండవల్లిలోని సీఎం కార్యాలయానికి తాను తన భర్త(నడవలేని స్థితిలో ఉన్నాడు)ను తీసుకుని వ్యయ ప్రయాసలకు ఓర్చి మరీ వెళ్తే.. కనీసం తమను లోపలికి కూడా వెళ్లనివ్వలేదని వాపోయింది.
తమకు టీడీపీ సభ్యత్వం ఉందా అని అక్కడ కొందరు ప్రశ్నించారని, సభ్యత్వ కార్డు ఉంటేనే లోపలికి పంపుతామని చెప్పడంతో అప్పటికప్పుడు రూ.200 చెల్లించి సభ్యత్వం తీసుకున్నామని, అయినా కూడాతమకు సీఎం దర్శనం లభించలేదని జగన్కు మొరపెట్టుకుంది. ఈ సందర్భంగా తమకు పెద్దకొడుకుగా ఉంటాడని బాబును గెలిపిస్తే.. మొద్దు కొడుకుగా మారి మాకు అవస్థలు పెడుతున్నాడని బాబుపై నిప్పులు చెరిగింది.
ఈ పరిణామం ఒక్కసారిగా జగన్ సభను వేడెక్కించింది. నిజానికి ఎవరికైనా సీఎంవోలోకి ప్రవేశం ఉంటుందని పెద్ద పెద్ద బోర్డులు ఉన్నాయి. అయితే, మహిళ ఇలా చెప్పేసరికి చాలా మంది మహిళలు ఔను ఔను అంటూ చేతులు ఎత్తడం కూడా చంద్రబాబుకు సొంత జిల్లాలో పెరుగుతున్న అసహనాన్ని పట్టిచూపించిందని అంటున్నారు విశ్లేషకులు. మరి పెద్ద కొడుకుగా చంద్రబాబు ఫెయిల్ అయ్యాడా? ఇప్పుడు దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. మరి బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.