అవును! ఇప్పుడు తెలంగాణలో ఇదే చర్చ నడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్గా ఉన్న నరసింహన్ తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్లపై ఈగైనా వాలనివ్వడం లేదని ఇటీవల కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో దుయ్యబట్టిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా నరసింహన్ వ్యవహారం తెరమీదకి వచ్చింది. గవర్నర్ ఇలా కూడా చేస్తున్నారా? అని అందరూ చర్చించుకున్నారు. అంతేకాదు, కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను ``ఫెలో`` అంటూ సంబోధించడం కూడా విమర్శలకు దారి తీసింది.
ఏ రాష్ట్ర గవర్నర్ అయినా అటు అధికార, ఇటు విపక్ష పార్టీల నేతలకు సమాన గౌరవం ఇవ్వాల్సి ఉంది. అయితే,.. నరసింహన్ మాత్రం ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆయన కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే గవర్నర్గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా గవర్నర్ వ్యవహరించిన తీరు మరింత వివాదాస్పదం అయింది.
తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గవర్నర్ నరసింహన్ ఇటీవల సందర్శించారు. పనులు శరవేగంగా సాగుతున్నాయని…దేశంలోనే ఇది ఓ గొప్ప ప్రాజెక్టు అవుతుందని ప్రశంసించారు. ఆయన అక్కడితో ఆగలేదు..ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరును కాళేశ్వరం చంద్రశేఖర్ రావుగా మార్చాలని వ్యాఖ్యానించారు. అంతే కాదు..తాను అలాగే పిలుస్తానని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
ఓ గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఫక్తు రాజకీయ నేతలాగా వ్యవహరించడం, వ్యాఖ్యానించడం ఏంటనే విమర్శలు వచ్చాయి. సీఎం కేసీఆర్ను ఇంతలాగా కాకా పట్టడం వెనుక రీజన్ ఏమై ఉంటుందనే ప్రశ్న కూడా తలెత్తింది. ఇక, గవర్నర్ అంతటితో ఆగలేదు. సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు పేరును కూడా కాళేశ్వరరావుగా పిలవాలని వ్యాఖ్యానించారు. దీనిపైనా విపక్షాలు మండిపడుతున్నాయి. గవర్నర్ ఇప్పటికైనా తన వైఖిరి మార్చుకోవాలని సూచిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.