ఈ మద్య చాలా మంది చిన్న చిన్న మనస్పర్ధలతో క్షణికావేశంలో తామేం చేస్తున్నారో అన్న విచక్షణ మర్చిపోయి..ఎదుటి వారిపై దాడి చేయడం..తిట్టడం..దారుణంగా చంపివేయడం కూడా జరుగుతున్నాయి. కోపం తగ్గాక తాము చేసిన పనికి సిగ్గుతో కుమిలిపోవడం జరుగుతుంది. అయితే కొన్ని ఇల్లీగల్ విషయాల్లో భార్యా భర్తల మద్య చోటు చేసుకునే విషయాలు హత్యలకు దారి తీస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. ఏది ఏమైనా చంపడం..చావడం అనేది రెండూ చట్టరిత్యా నేరము.
తాజాగా పాకిస్థాన్లోని సింధ్ రాష్ట్రంలో సీనియర్ మంత్రి మీర్ హజార్ఖాన్ బిజ్రాని(71) తుపాకీతో భార్యను కాల్చిచంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆ దేశంలో కలకలం రేపుతోంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన నేత, ప్రణాళిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మీర్ హజార్ ఖాన్ బిజ్రానీ తన భార్య ఫరీహా రజాక్పై కరాచీలోని తన నివాసంలో మూడుసార్లు తుపాకీతో కాల్పులు జరిపి, ఆపై తాను కూడా అదే రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి భార్యాభర్తల మధ్య వ్యక్తిగత కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థరించారు.
ఇద్దరి మృతదేహాలను వారి బెడ్రూమ్లోనే రక్తపుమడుగులో పోలీసులు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రక్తపుమడుగులో ఉన్న మృతదేహాలకు పోస్ట్మార్టమ్కు తరలించి, పూర్తయిన తర్వాత అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి హజార్ఖాన్ ఆత్మహత్యకు ముందు భార్యపై కాల్పులు జరిపి ఆమెను హత్యచేశాడని కరాచీ సౌత్ జోన్ డీఐజీ తెలిపారు.
ఇద్దరి మృతదేహాల్లోనూ లభ్యమైన బుల్లెట్లు ఒకే రివాల్వర్ నుంచి వచ్చినవేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలో వెల్లడయ్యింది. అయితే తమ తల్లిదండ్రుల బెడ్ రూమ్ నుంచి కాల్పుల శబ్ధం రావడంతో మంత్రి బిజ్రానీ కుమారుడు, పనివాళ్లు చేరుకుని అతికష్టం మీద తలుపు తెరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.