మార్చి 14న గుంటూరులో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు అంతా సిద్ధమైంది. ఈ సభ కోసం పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తగినంత మంది పోలీసులను
మోహరిస్తున్నారు. ఈ ఏర్పాట్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన ఆవిర్భావ సభలో మీరందింస్తున్న భద్రతకు పోలీసు శాఖవారు
తీసుకుంటున్న జాగ్రత్తలకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.
అదే సమయంలో ఆయన పోలీసులకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. తాను భద్రత కోరుతోంది ప్రదర్శనా కుతూహలంతో కాదని, ప్రస్తుతం సమాజంలో ఉన్న ఉద్యమాల కారణంగా
తన భద్రత సున్నితమైన సామాజిక రాజకీయ సమస్యలతో ముడివడి ఉందని తెలిపారు. తనపై ఏదైనా దాడి జరిగితే అది ప్రజాజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పవన్
కళ్యాణ్ అన్నారు.
గతంలో భీమవరంపట్నంలో తన ఫ్లెక్సీని చించేసినందుకు దాదాపు రెండువేల మంది తన అభిమానులు ధర్నా చేశారని, దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని
వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని గుర్తు చేశారు. అలాగే కాకినాడలో తన సభ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాట గురించి ప్రస్తావించారు. విజయవాడలో ఉద్దానం
బాధితుల అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తాను కలిసేందుకు వెళ్లినప్పుడు దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించి ప్రజలు ఇబ్బంది
పడ్డారన్నారు.
తాను అనంతపురంలో పర్యటించిన సమయంలో తొక్కిసలాట జరిగిందని, ఈ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని తాను భద్రతను కోరుతున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఇంతకూ పవన్ సూచనలు.. భద్రతల కోసమా.. లేక ప్రభుత్వానికి తన సత్తా గుర్తు చేయడమా..!?