ఆంధ్ర రాజకీయాల్లో పెను సంచలనాలు జరగబోతున్నాయా... వచ్చే 12 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అనూహ్యమైన మార్పులు జరగబోతున్నాయా.. ఎత్తులు, పై ఎత్తులతో ఏపీ రాజకీయ రంగం అట్టుడికిపోతుందా.. ఎవరూ, ఎప్పుడూ ఊహించనన్ని సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరగబోతున్నాయా.. అసలు రాజకీయం అనే పదానికి అర్థం ఏంటో త్వరలోనే ఏపీలో రాజకీయాల ద్వారా తెలియబోతోందా..
ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోందంటున్నారు సినీనటుడు శివాజీ.. దక్షిణాదిలో ఉన్న అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకోవడమే లక్ష్యంగా ఓ జాతీయ పార్టీ దారుణమైన రాజకీయ క్రీడ ప్రారంభించబోతోందని ఆయన చెబుతున్నారు. ఈ మొత్తం ఆపరేషన్ కు ఆపరేషన్ ద్రవిడ అనే పేరు పెట్టినట్టు శివాజీ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో ఆపరేషన్ గరుడ ను చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగుతోన్న ఆపరేషన్ గరుడలో ఓ జాతీయ పార్టీ , దానికి లక్ష్యంగా ఉన్న మరో ప్రాంతీయ పార్టీ ..ఓ కొత్త పార్టీ నాయకుడు ఉన్నారని శివాజీ చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆపరేషన్ జరుగుతోందన్నారు. జాతీయ పార్టీకి అనుబంధంగా ఉన్న కర్ణాటక నుంచి పనిచేసే సంస్థ ద్వారా ఏడాది క్రితం 2017 లో ఈ విషయం తనకు తెలిసినట్లు శివాజీ తెలిపారు.
తాను ఈ విషయం అప్పట్లోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పానని.. ఇప్పుడు తాను చెప్పిన విధంగానే ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయని శివాజీ గుర్తు చేశారు. ఆ ఆపరేషన్ కు సంధాన కర్తగా రాజ్యాంగశక్తి ఉన్నాడని అన్నారు. దుర్మార్గమైన ఈ ఆపరేషన్ లోకి రావడమే తప్ప బయటకు వెళ్లడం ఉండదని శివాజీ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని తమిళనాడు, కేరళ, కర్ణాటకలోనూ ఇదే తరహాలో ఆపరేషన్ జరుగుతోందని వీటికి పలు పేర్లు పెట్టినట్లు శివాజీ చెప్పారు. కొత్తగా వచ్చిన కొత్త పార్టీ ద్వారా పోరాటం చేయించి తద్వారా డిమాండ్లు నెరవేర్చి లబ్ది పొందడమే లక్ష్యంగా ఆపరేషన్ కొససాగుతుందన్నారు.