సుప్రీంలో బీజేపీకి చేదు అనుభవం!!
ఎంత ఆధిఖ్యత ఉన్నా కొన్నిప్రభుత్వాలు తను అనుకున్నట్లు పాలన కొనసాగించటం ప్రజాస్వామ్యంలో అంతగా సాధ్యపడదు. అదే ప్రజాస్వామ్య విధానంలోని సౌందర్యం. బ్యూటీ ఆఫ్ ది డెమాక్రసి. ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు డెమాక్రసీ రాజ్యాంగంలో ఎక్కడో అక్కడ 'చెక్' చెప్పే 'చెక్ పాయింట్స్' ఉంటాయి. ఉదాహరణకు:
పశ్చిమ బెంగాల్ లో జరగనున్న స్థానిక సంస్థల (పంచాయతీ) ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు తిరస్కరించింది. రాష్ట్రంలో జరగ నున్న ఎన్నికల ప్రక్రియలో తలదూర్చబోమని పూర్తిగా స్పష్టం చేసింది. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థు లు నామినేషన్ దాఖలు చేయకుండా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారనీ, దీని పై సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని బీజేపీ తన పిటిషన్ లో కోరింది.
నామినేషన్ల గడువును పొడిగించడంతో పాటు, పంచాయితీ ఎన్నికల్లో 'సీఆర్పీఎఫ్ దళాల' ను మోహరించేలా కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేయాలని అభ్యర్థించింది. అయితే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోబోమంటూ సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. మే 1నుంచి 5వరకు మూడుదశల్లో పశ్చిమ బెంగాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మే 8న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
సాధారణంగా పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నేతృత్వంలో జరుగుతాయి. పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది కోసం ఎన్నికల సంఘం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పైనే ఆధార పడుతుంది. రాష్ట్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరనిదే, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తన దళాలను మోహరించే అవకాశం లేదు. కాగా పంచాయతీ ఎన్నికల్లో కేవలం రాష్ట్ర పోలీసుల సేవలను మాత్రమే వినియోగించు కునేందుకు మమత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. అయితే రాష్ట్ర పోలీసులు తటస్థ వైఖరితో ఉంటారా? అన్న దానిపై బీజేపీ సహా ప్రతి పక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.