కర్ణాటకలో ఎన్నికల ముంగిట బీజేపీని ఇంటా బయటా సమస్యలు వెంటాడుతున్నాయి. రోజురోజుకూ పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. దేశంలో నెలకొన్న ఘటనలను చక్కబెట్టలేకనే ఆగమాగం అవుతున్న పార్టీ అధిష్టానం కన్నడ ఎన్నికలపై సరైన ద`ష్టిసారించలేని అయోమయ స్థితి నెలకొంది. ఇప్పటికే పలు ప్రీపోల్ సర్వేలు, ఇటీవల నిర్వహించిన ఇండియాటుడే-కార్వీ ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీనే అతిపెద్ద పార్టీగా ఎర్పడుతుందని చెప్పాయి. ఈ ఫలితాలతో నిరాశతో ఉన్నబీజేపీని ఎన్నికల అభ్యర్థుల జాబితాలతో అసమ్మతి ఒక్కసారిగా చెలరేగింది.
తొలి జాబితాపై భగ్గుమన్న అసంతృప్తి చల్లారకముందే బీజేపీ సోమవారం విడుదల చేసిన రెండో జాబితా కూడా పార్టీ శ్రేణుల్లో మరింత చిచ్చు రగిల్చింది. 82 మంది అభ్యర్థులతో ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం జాబితా ప్రకటించిన కొద్దిసేపటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో టికెట్లు లభించని ఆశావహుల మద్దతుదారులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇదిలా ఉండగా.. రెండో జాబితాలో మహిళలకు, మైనారిటీలకు ఒక్కసీటు కూడా ఇవ్వలేదు. మరో రెండు రోజుల్లో విడుదలకానున్న మూడో జాబితాతో మరెంత రచ్చరచ్చ అవుతుందో మరి.
బీదర్ జిల్లా బాల్కిలో ప్రకాష్ ఖండ్రెకు టికెట్ నిరాకరించినందుకు ఆయన మద్దతుదారులు రాస్తారోకో నిర్వహించి టైర్లకు నిప్పు పెట్టారు. సాగర్ నియోజకవర్గంలో బేలూరు గోపాలకృష్ణ వర్గీయులు బీజేపీ ప్రచార రథంపైనే దాడి జరిపి ప్రధాని మోదీ, మాజీ సీఎం యడ్యూరప్పల ఫ్లెక్సీలను చింపివేశారు. ఇక్కడ హరతాళ్ హాలప్పకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ధార్వాడ జిల్లా కలఘటిగెలో నిమ్మణ్ణ వర్గీయులు రోడ్లపైకి వచ్చి టైర్లకు నిప్పు పెట్టి వాహనాలపై రాళ్లు రువ్వారు. రెండో జాబితాలోనూ టికెట్ ప్రకటించనందుకు మాజీ స్పీకర్ బోపయ్య వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోయారు. బంగారుపేటలో టికెట్ దక్కని ఎం.నారాయణ స్వామి వర్గీయులు, బెంగళూరు మహాలక్ష్మీ లేఅవుట్లో టికెట్ దక్కని ఎం.నాగరాజ వర్గీయులు, పావగడలో టికెట్ చేజారుతుందన్న ఆందోళనలో కొత్తూరు హనుమంతరాయప్ప వర్గీయులు ధర్నాకు దిగారు.
అభ్యర్థుల జాబితాపై రాష్ట్ర వ్యాప్తంగా అసమ్మతి చెలరేగడానికి ప్రధానంగా అందరినీ సమన్వయపర్చడంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా విఫలం చెందారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకోగానీ.. కన్నడ ఎన్నికల ప్రచారంలో ఆయన మొదటి నుంచీ తడబడుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్, సీఎం సిద్ధరామయ్యను సమర్థవంతంగా ఎదుర్కొనలేదన్న భావన పార్టీ శ్రేణుల్లో బలంగా నాటుకుపోయింది. అంతేగాకుండా పలు సమావేశాల్లో మాటల్లో తడబాటు, పొరపాట్లతో ఆయన జోకర్గా మిగిలారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
చివరకు ఆయన రాష్ట్ర బీజేపీ నేతలపై పట్టుసాధించకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే చర్చ పార్టీ వర్గాల్లోజరుగుతోంది. ఇదేసమయంలో కన్నడ ఎన్నికలకు ప్రధాని మోడీ కూడా దూరంగా ఉండడం ఈ పరిస్థితికి మరో కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప మాట్లాడుతూ టికెట్లు రాని అభ్యర్థుల్లో అసంతృప్తి సహజమని కొట్టిపారేశారు. రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుందని తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే కీలక పదవులు అప్పగిస్తామని పలువురికి భరోసా ఇచ్చారు.