సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండగా ఏపీ ప్రతిపక్షం వైసీపీలోకి వలసలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన కొందరు నేతలు వైసీపీలోకి చేరగా.. తాజాగా మరో ఇద్దరు బీజేపీ కీలక నేతలు త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. జగన్ పాదయాత్రకు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి స్పందన పెరుగుతోన్న నేపథ్యంలో కీలక నేతలు పలువురూ ఆ పార్టీలో చేరుతుండడం ఆ పార్టీలో ఎక్కడా లేని నూతన ఉత్సాహాన్ని నింపుతోంది.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మోసం, ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడం లాంటి పరిణామాల తర్వాత ఏపీలో బీజేపీకి ఫ్యూచర్ లేదన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు చాలా మంది గ్రహించేశారు. బీజేపీని నమ్ముకుని ఉంటే తమకు ఫ్యూచర్ లేదని డిసైడ్ అయిన వారు ఇప్పుడు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అధికార టీడీపీ ఇప్పటికే ఓవర్ లోడ్తో ఉంది. వైసీపీ నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 23 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరిపోయారు.
ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వీళ్లలో చాలా మందికి చంద్రబాబు సీట్లు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి కొందరిని పక్కన పెట్టక తప్పేలా లేదు. ఇక బీజేపీ నుంచి కూడా కొన్ని వలసలు టీడీపీలోకి ఉండడం గ్యారెంటీ. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఇద్దరు ముగ్గురు బీజేపీ ప్రతినిధులు ఎన్నికలకు కాస్త ముందుగా పసుపు కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. వీరికి కూడా టీడీపీ టిక్కెట్లు గ్యారెంటీ అంటున్నారు.
దీంతో ఇప్పుడు పార్టీ మారదాం అనుకునే సీనియర్లు, పట్టున్న గట్టి లీడర్లు, బీజేపీలో కీలక లీడర్లకు వైసీపీయే బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలైన కాటసాని రాంభూపాల్ రెడ్డి, కన్నా లక్ష్మి నారాయణ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. జగన్ సమక్షంలో బుధవారం వైసీపీలోకి చేరనున్నారు ఈ ఇద్దరు. కాగా.. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంపై అలకతో ఉన్న లక్ష్మి నారాయణ కొంత కాలంగా బీజేపీ హై కమాండ్పై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో కన్నా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఇక కన్నాకు గుంటూరు జిల్లాలో పెదకూరపాటు లేదా గుంటూరు వెస్ట్ సీటు ఇస్తామని చెపుతున్నా ఆయన తన ఫ్యామిలీకి రెండు సీట్లు అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక కాట సాని రాంభూపాల్రెడ్డికి నంద్యాల ఎంపీ సీటుపై హామీ వచ్చిందని తెలుస్తోంది. ఏదేమైనా ఈ వలసలతో వైసీపీలో ఎక్కడా లేని జోష్ నెలకొంది.