గుంటూరు నేత కన్నా లక్ష్మినారాయణ రాజకీయ జిమ్మిక్కులు ఆసక్తి రేపుతున్నాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని భావించిన కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ జగన్ కే అనుకూలంగా ఉంటుందని అంచనాకు వచ్చిన ఆయన జగన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పార్టీలో చేరతున్నానన్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారైంది.
కానీ అనూహ్యంగా పార్టీలో చేరాల్సిన రోజు ఆయన మరో డ్రామాకు తెరతీసినట్టు తెలుస్తుంది. టీడీపీ నుంచి కూడా ఆయనకు మంచి ఆఫర్ వస్తుండటంతో కన్నా డైలమాలో పడిపోయారు. ఇప్పుడు వైసీపీనా, టీడీపీనా తేల్చుకోలేక సతమతమవుతున్నారు. అందుకే వైసీపీలో చేరాల్సిన రోజు ఆయన ఆరోగ్యం బాగాలేదంటూ ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు టీడీపీ ఆఫర్ పై ఆయన ఆలోచనలో పడ్డారు.
ఆసుపత్రిలో చేరేందుకు కారణం హైబీపీ అని అనిచెబుతున్నా.. ఆ హైబీపీని జగన్ కు, చంద్రబాబుకు తెప్పించాలనే కన్నా ఆస్పత్రిలో చేరినట్లు కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలో కన్నా బలమైన నాయకుడే. పెదకూరపాడు, గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా కనీసం రెండున్నర దశాబ్దాలు ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా కూడా వైఎస్ హయాంలో పనిచేశారు.
టీడీపీ కూడా కన్నా వంటి బలమైన లీడర్ ను తనతో చేర్చుకుంటేనే బెటర్ అని భావిస్తోంది. అందుకే సాధ్యమైనంతవరకూ బేరసారాలు సాగిస్తోంది. పార్టీలో అన్నివిధాలా సహకరిస్తామని భరోసా ఇస్తోంది. మరి కన్నా ముందే తన పొలిటికల్ డిమాండ్లకు హామీలు పొందుతారా.. లేక ముందు పార్టీలో చేరి ఆ తరవాత ఒత్తిడి తెస్తారా అన్నది చూడాలి.