కర్ణాటకలో అతిపెద్ద నియోజకవర్గం.. అందునా తెలుగు వారు ఎక్కువగా ఉన్న దక్షిణ బెంగళూరుపై కాంగ్రెస్, బీజేపీ సహా ప్రాంతీయ పార్టీ జేడీఎస్ కూడా భారీ ఎత్తున ఆశలు పెంచుకున్నాయి. ఇక్కడి నుంచి పోటీ చేయడాన్ని నాయకులు సవాలుగా భావిస్తుంటారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించాడు. అయితే, ఇప్పుడు మాత్రం పోటీ తీవ్రంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ- కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ పెరుగుతోంది. ఇక్కడ మరోసారి గెలిచి.. హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ అభ్యర్థి ఎం.కృష్ణప్ప పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ తరఫున ఆర్.కె.రమేష్, జేడీఎస్ నుంచి ప్రభాకర్రెడ్డి పోటీలో ఉన్నారు.
2008, 2013 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి కృష్ణప్ప విజయం సాధించారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల్ని ఆకట్టుకునేలా అభివృద్ధి పనులు చేశారు. తెలుగు, కన్నడ భాషలను ధారాళంగా మాట్లాడే సామర్థ్యం ఆయనలో ఉండడంతో ప్రజలకు ఆయనకు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతున్నారు. 1983 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. జనతాపార్టీలో పనిచేశారు. గత పదేళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులు ప్రజల ముందు కనపడుతున్నాయని, వాటి ఆధారంగా ఓట్లు అడుగుతున్నట్లు ఎం.కృష్ణప్ప అంటున్నాడు.
నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు అధిక సంఖ్యలో ఉండడంతో వారంతా తనకు మద్దతు ఇస్తున్నారని, ఆంధ్రకు ప్రత్యేక హోదా ప్రభావం వారిపై లేదని చెబుతుండడం గమనార్హం. ఆంధ్ర రాజకీయాలు ఇక్కడ పనికి రావని అనే బీజేపీ నేతల్లో కృష్ణప్ప మొదటి వాడు. జిగిణిలో ఉన్న తెలుగు సంఘాల మద్దతూ తనదేనని ధీమా వెలిబుచ్చారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.కే రమేష్. బీజేపీ సభ్యుడి వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తనకు శ్రీరామరక్ష అని అంటున్నాడురు.
గత ఎన్నికల్లో ఓడిపోయిన జేడీఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డి మాత్రం రెండు పార్టీల్ని తిరస్కరించి ఓటర్లు తనను గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 5.89 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గోట్టెగెరె, కోణ్ణకుంటె, అంజనాపుర, యలవనహళ్లి, ఉత్తర హళ్లి, వసంతపుర బేగూరు, సింగసంద్ర వార్డులు ఉన్నాయి. నియోజకవర్గం పరిధిలో ఐటీ, బీటీ కంపెనీలు అధికంగా ఉండే ఎలక్ట్రానిక్ సిటీ, బన్నేరుఘట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ తెలుగు టెకీలదే హవా నడుస్తోంది. దీంతో ఎవరికివారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.