రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బతీయడమే లక్ష్యం! అది ఎలా అన్నది తర్వాత విషయం. అవకాశం ఎలా ఉంటే అలా దెబ్బతీయడం.. రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్యం. ఇక, ఈ విషయంలో తనకంటూ ప్రత్యేకతను సాధించిన ప్రధాని నరేంద్ర మోడీ .. బీజేపీ జాతీయ సారథి.. అమిత్ షాలు ఇప్పుడు ఏపీపై ముఖ్యంగా అధికార టీడీపీ సహా అధినేత పై కక్ష రాజకీయాలకు తెరదీశారు. ఈ ఏడాది ప్రారంభం వరకు టీడీపీతో చెట్టాపట్టాలేసుకుని ముందుకుసాగిన బీజేపీ.. అనుసరించిన వైఖరితో .. టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. అంతేకాదు..ఏపీకి అన్యాయం చేస్తున్నారంటూ.. కేంద్రంపై విరుచుకుపడుతున్నారు చంద్రబాబు.
జాతీయ స్తాయిలో మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలను పెంచుతున్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు బీజేపీ నేతలు. అయితే, ఇప్పటి వరకు బీజేపీ సారథులు టీడీపీ అధినేతపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబు మోడీని ఎంత గట్టిగా విమర్శించినా .. బీజేపీ జాతీయ నాయకుల నుంచి ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు రాలేదు. అయితే, పైకి తెలియకుం డానే, చేతులకు మట్టి అంటకుండానే రాజకీయంగా చంద్రబాబును దెబ్బేసేసేందుకు మోడీ ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే ఔననే అంటున్నారు సాక్షాత్తూ చంద్రబాబు!
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో నియోజకవర్గాలను పెంచాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు దీనిపై మోడీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అంతేకాదు, నియోజకవర్గాల పెంపు విషయంలో 2024లో జరుగుతుందని గతంలోనే ఏపీ ఆశలపై నీళ్లు జల్లారు. అయితే, ఇప్పుడు మరో వ్యూహంతో మోడీ ఇక, ఈ ఆశలు కూడా లేకుండా చేసేందుకు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై నీళ్లు జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని బాబు చెప్పుకొచ్చారు.
బాబు చెప్పిన ప్రకారం.. 15వ ఆర్థిక సంఘం తీరును గమనిస్తే మరింత బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటాననడం విచారకరమన్నారు. 2011 జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే దక్షిణ భారతానికి పార్లమెంటు సీట్లు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని పేర్కొనడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఇది ప్రగతి శీల రాష్ట్రాలకు అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు.
14వ ఆర్థిక సంఘం 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకుందని, కొత్త ఆర్థిక సంఘం 2011 జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కు మరింత నష్టం కలుగుతుందన్నారు. అయితే, కేంద్రం మాత్రం ఈ దిశగానే ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే బాబు ఇలా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబును మోడీ ఇలా కూడా దెబ్బేసే స్తున్నారని అనిపిస్తోంది. మరి బాబు ఎలా దీని నుంచి బయట పడతారో చూడాలి.