ఏపీలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీ సీఎం, టీడీపీ అదినేత చంద్రబాబు తన చాణక్యాన్ని ప్రదర్శించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయ దురంధరులకు పెద్ద పీట వేసేందుకు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం వైసీపిని ఇరుకున పెట్టగలిగే నోరున్న నేతలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు, పార్టీని అధికారంలోకి తేగలగడంలో కీలకంగా వ్యవహరిస్తారని భావిస్తున్న వారికి పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇప్పుడు త్వరలోనే ఆయన స్వల్పంగా మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని భావిస్తున్నట్టు అమరావతి వర్గాలు చెబుతున్నాయి.
ప్రధానంగా పార్టీని స్థాపించన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంకత భావంతో పనిచేస్తూ.. ప్రజల్లో తిరుగులేని అభిమానం చూరగొన్న నేతలకు బాబు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు మంత్రి వర్గంలోకి రావాలని ప్రయత్నించిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, గుంటూరు జిల్లాను తన కనుసైగతో శాసించ గల నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు పెద్ద పీట వేయనున్నారు. త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించి ఆయనకు మంత్రి పదవిని అందించాలని బాబు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం స్పీకర్గా ఉన్న ఆయన 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలోనే మంత్రి పదవిని ఆశించారు. ప్రధానంగా ఆయన హోం మంత్రి పదవిపై కన్నేశారు.
అయితే, అప్పటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో ముఖ్యంగా ప్రతిపక్షం బలంగా ఉన్న కారణంగా సమర్ధుడైన స్పీకర్ ఉండాలని బాబు భావించారు. దీంతో స్పీకర్గా కోడెలను ఆయన రాత్రికి రాత్రి ఎంపిక చేశారు. దీనికి కోడెల అయిష్టంగానే అంగీకరించినట్టు పలు మార్లు వార్తలు వచ్చాయి. స్వయంగా ఓ ఇంటర్వ్యూలో కోడెల కూడా దీనిపై చూచాయగా అసం తృప్తి వ్యక్తం చేశారు. అయినా అధినేత మాటను తోసిపుచ్చలేక ఆయన స్పీకర్గా పనిచేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్లో జరిగిన మంత్రి వర్గం విస్తరణలో అయినా అవకాశం దక్కుతుందని భావించారు. కానీ, అప్పుడు కూడా స్వల్పంగానే మంత్రి వర్గాన్ని విస్తరించడంలో కోడెల కల నెరవేరలేదు.
ఇక, ఇప్పుడు మరో ఏడాలో ఎన్నికలు ఉండడం, బలమైన గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉండడం, నేతల్లో అసంతృప్తిని పాలదోలాలని, వారికి స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఇవ్వాలని భావించడంతో చంద్రబాబు తాజాగా మరోసారి మంత్రి వర్గాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనికి ఈ నెలలోనే ముహూర్తం ఖరారు చేసినట్టు గా కూడా సమాచారం. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న స్పీకర్ కోడెలకు ఛాన్స్ ఇవ్వాలని బాబు గట్టిగా నిర్ణయించుకున్నట్టు సమాచారం.