చంద్రబాబునాయుడుతో ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ భేటీ వెనుక రాజకీయ కోణముందా ? రాజకీయ వర్గాల్లో ఇపుడిదే విషయమై చర్చ మొదలైంది. పరిశ్రమల ఏర్పాటు, పురోగతి అంశాల ముసుగులో ఇద్దరి మధ్య రాజకీయ చర్చలే ప్రధానంగా చోటు చేసుకున్నాయని కూడా పార్గీ నేతల్లో చర్చలు జరుగుతున్నాయి. దీనికి కారణమేమిటంటే, అనిల్ అంబాని ఇటు చంద్రబాబుతో పాటు అటు ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు కూడా అత్యంత సన్నిహితుడు కావటమే ప్రధాన కారణం.
ప్రస్తుతం చంద్రబాబు-మోడి మధ్య సంబంధాల పూర్తిగా క్షీణించిన విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే కేంద్రమంత్రివర్గం ఉండి ఎన్డీఏలో నుండి చంద్రబాబు తప్పుకున్నారో అప్పటి నుండి చంద్రబాబుకు కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. దాంతో బిజెపితో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మోడిపై చంద్రబాబు యుద్ధం ప్రకటిస్తున్నట్లు అనేక సందర్భాల్లో చెప్పిన విషయం కూడా తెలిసిందే.
మోడిపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు
మోడికి వ్యతిరేకంగా చంద్రబాబు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. ఇది ఒక రకంగా బిజెపికి ఇబ్బందిగా మారింది. ఎందుకంటే, రాష్ట్రంలో బిజెపికంటూ పెద్దగా బలం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో బిజెపి-టిడిపి కలిసి పోటీ చేశాయి కాబట్టే కమలం పార్టీకి ఈమాత్రమైనా సీట్లు వచ్చాయి. అదే సమయంలో బిజెపి వల్ల టిడిపి కూడా లబ్ది పొందినమాటా వాస్తవమే.
చంద్రబాబు-మోడికి సంధాన కర్తగానా ?
అయితే, సాధారణ ఎన్నికలకు ముందు బిజెపి-టిడిపిలు విడిపోవటం రెండు పార్టీలకు నష్టం చేకూర్చే అవకాశాలున్నాయి. ఈ విషయం ఇటు చంద్రబాబుతో పాటు అటు మోడి, అమిత్ షా లు కూడా గ్రహించారని సమాచారం. అయితే, మళ్ళీ రెండు పార్టీలు కలవాలంటే చిన్న విషయంకాదు. చంద్రబాబు-మోడిని దగ్గర చేయాలంటే అందుకు ఇద్దరికీ సన్నిహితులై ఉండాలి. అంతటి సీన్ చాలామంది నేతలకు లేదు. ఈ నేపధ్యంలోనే అడాగ్ (అనిల్ ధీరూబాయ్ అంబాని గ్రూప్) ఛైర్మన్ అనిల్ అంబాని రంగంలోకి దిగినట్లు ప్రచారం మొదలైంది.
పరిశ్రమలపైనా చర్చ
నెల్లూరు, వైజాగ్ లో విద్యుత్ , మౌళిక సదుపాయాల కల్పన పరిశ్రమలు పెట్టే విషయంలో అనిల్ చాలా ఆసక్తిగా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున భూములు కూడా తీసుకున్నారు. అయితే, ప్రాజెక్టు్లో పురోగతి కనబడటం లేదు. అందుకని ఇచ్చిన భూములను వెనక్కు తీసుకోవాలని ఉన్నతాధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ విషయంపై కూడా చంద్రబాబు-అనిల్ మధ్య చర్చలు జరిగాయని సమాచారం.