విశాఖపట్నం జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మళ్ళీ వైసిపిలోకి చేరుతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఎలాగైనా కొణతాలను పార్టీలోకి రప్పించేందుకు వైసిపి అగ్రనేతల తరపున కూడా ప్రయత్నాలు మొదలైనట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వైసిపిలో ఇటీవలే చేరిన యలమంచిలి మాజీ ఎంఎల్ఏ కన్నబాబు రాజు తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాజు ఇప్పటికే కొణతాలను కలిసి మాట్లాడారట. అయితే, మాజీ మంత్రి పెద్దగా స్పందించలేదని సమాచారం. అందుకే వెంటనే అదే విషయాన్ని రాజ్యసభ సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా కొణతాలతో ఫోన్లో మాట్లాడారట. కన్నబాబుతో మాట్లాడినట్లు పొడిపొడిగా కాకుండా కాస్త వివరంగా మాట్లాడారట. దాంతో వైసిపిలో చేరే విషయంలో కొణతాల సానుకూలంగా స్పందిస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఉత్తరాంధ్రలో వైసిపి అంత వీకా ?
నిజానికి కొణాతల లాంటి సీనియర్ల అవసరం వైసిపికి చాలా ఉంది. వైసిపిలో ఉన్నపుడు కొణతాలే ఉత్తరాంధ్రలో పార్టీ వ్యవహారాల మొత్తాన్నిచూసుకునే వారు. అయితే వివిధ కారణాల వల్ల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో కొణతాలకు బాగా గ్యాప్ వచ్చింది. దాంతో పార్టీలో మాజీ మంత్రిని మిగిలిన నేతలు పక్కనబెట్టేశారు. దాంతో అవమానంగా భావించిన కొణతాల పార్టీకి దూరమైపోయారు. దాదాపు ఏడాదికాలంగా కొణతాల ఏ పార్టీలోనూ చేరలేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక పేరుతో అభివృద్ధి కార్యక్రమాలపై ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరకపోయినా మొత్తానికి ఏదో ఒక రూపంలో కొణతాల యాక్టివ్ గానే ఉన్నారన్నది వాస్తవం.
ఉత్తరాంధ్రలో వైసిపి బలమెంత ?
మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు తరుముకొస్తున్నాయ్. వైసిపి పరంగా చూస్తే ఉత్తరాంధ్రలో ఇప్పటికీ ఏమంత బలంగా లేదనే చెప్పాలి. చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై జనాల్లో ఉన్న వ్యతిరేకత వైసిపికి కలిసి వస్తుందా రాదా అన్న విషయాన్ని పక్కనపెడదాం. క్షేత్రస్ధాయి పరిస్ధితిని గమనిస్తే మాత్రం ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో పార్టీ ఏమంత బలంగా లేదనే చెప్పాలి. మహా అయితే ఓ 15 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులుంటే ఉండవచ్చు. మరి, మిగిలిన నియోజకవర్గాల పరిస్ధితేంటి ? అందులోనూ గట్టి అభ్యర్ధులనుకున్న వారిలో గెలిచేదెంతమంది ?
సీనియర్ల అవసరం ఉందా ?
ఇక్కడే వైసిపికి పలువురు సీనియర్ నేతల అవసరం ఉందన్న విషయం అర్ధమైంది. గ్రౌండ్ రియాలిటీని దృష్టిలో పెట్టుకునే కొణతాల లాంటి సీనియర్లతో మంతనాలు మొదలుపెట్టినట్లున్నారు. ఒకవేళ వైసిపి కృషి ఫలిస్తే, వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపిగా కొణతాల పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలతో తనకున్న సన్నిహితం ఆధారంగా పలువురు గట్టి నేతలను కూడా వైసిపిలోకి తేగలరన్న నమ్మకంతో వైసిపి అగ్రనేతలున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే. జగన్ పాదయాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించే సమయానికి ఏ విషయం తేలిపోతుది లేండి.