ఆ సీటు విషయం జగన్ కొంప ముంచ బోతుందా...!
పాదయాత్ర జగన్ ఎంత గానో కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే జగన్ సీఎం అయ్యేటట్లు కనిపిస్తున్నాడు. సర్వేలన్నీ జగన్ కే అనుకూలంగా ఉన్నాయి. అయితే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు జగన్ కి ఇబ్బంది కలిగిస్తాయని అందరూ అంచనా వేస్తున్నారు. తాజాగా రాజమహేంద్రవరం ఎంపీ సీటు విషయంలో జగన్ చేసిన ప్రకటన దానికి సాక్ష్యంగా ఉందని పలువురు భావిస్తున్నారు. రాజమండ్రి ఎంపీ సీటుని బీసీలకు కేటాయించాలని జగన్ నిర్ణయించడం, దానిని బీసీ సంఘాల సమావేశంల ప్రకటించడం వైసీపీ నేతలకు కూడా మింగుడుపడడం లేదు.
రాజమండ్రి నుంచి చాలాకాలంగా కమ్మ సామాజికవర్గం ప్రాతినిధ్యం వహిస్తోంది. మధ్యలో రెండు సార్లు బ్రాహ్మణ వర్గానికి చెందిన ఉండవల్లి మినహా 1991 నుంచి కమ్మ సామాజికవర్గమే ఎంపీలుగా పనిచేశారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం సిటీ, అర్బన్, కొవ్వూరు. నిడదవోలు, రాజనగరం నియోజకవర్గాల్లో కమ్మ వర్గం కీలకమైనది. సంఖ్యతో సంబంధం లేకుండా రాజకీయంగా ప్రభావితం చేయగల వర్గం. అలాంటి సమయంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఐదు చోట్ల చక్రం తిప్పే వర్గాన్ని కాదని బీసీలకు సీటు కేటాయిస్తాననడం జగన్ కి ఆత్మహత్యా సద్రుశ్యంగానే భావించాలని పరిశీలకుల అభిప్రాయం.
గడిచిన ఎన్నికల్లో కూడా బలహీనమైన కమ్మ అభ్యర్థి బొడ్డు వెంకటరమణని రంగంలో దింపడం ద్వారా జగన్ చేదు ఫలితాన్ని చవి చూసిన విషయం మరచిపోకూడదని చెబుతున్నారు. అంతేగాకుండా గడిచిన ఎన్నికల్లో కూడా కాపులకు పెద్ద పీట వేయాలనే ఉద్దేశంంతో జగన్ ఇలాంటి ప్రయోగాలు చేశారు. నర్సాపురం , ఏలూరు ఎంపీ సీట్లును ఏకంగా ఒకే జిల్లాలో రెండు సీట్లు కూడా కాపులకు కేటాయించడం ద్వారా కాపుల ఓట్లను కాజేయాలని ప్రయత్నించి బోల్తాపడ్డారు. కాపులంతా జనసేనాని మాటలతో టీడీపీకి ఓటేయగా, వైసీపీ జీరో స్థానాలతో పశ్చిమలో పరువు కోల్పోయింది. ఇక ఇప్పుడు బీసీలకు పెద్ద పీట వేసినప్పటికీ ఆ వర్గాల్లో టీడీపీకి ఉన్న పట్టు చిన్నదేం కాదు. దాంతో వైసీపీకి బీసీ ఓట్లు పడతాయనుకోవడం అత్యాశే అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.