అనంతపురం తెలుగుదేశంపార్టీ ఎంపి జెసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కడపలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు, టిడిపి సీనియర్ నేత సిఎం రమేష్ ను పరామర్శించారు. ఆసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఇటువంటి దీక్షలు ఎన్ని చేసినా ఫ్యాక్టరీ రాదన్నారు. సిఎం రమేష్ పిచ్చిపట్టి దీక్షలు చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ దీక్షల వల్ల ఉక్కు పరిశ్రమ కాదుకదా తుక్కు పరిశ్రమ కూడా రాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రమేష్ చేస్తున్న దీక్షలో నిజాయితి లేదన్నారు. మందులతో సాగుచేసిన తిండి తింటున్న వారిలో నిజాయితీ ఎలా ఉంటుందని ఎద్దేవా చేశారు.
దీక్షలన్నీ దండగన్న జెసి
ఒక వైపేమో స్వయంగా చంద్రబాబునాయుడే ప్రోత్సహించి మరీ దీక్షలు చేయిస్తుంటే ఇంకోవైపు జెసి ఈ దీక్షలన్నీ దండగ అన్నట్లుగా మాట్లాడటం విశేషం. దీక్షలకు స్పందించే గుణం కేంద్రప్రభుత్వానికి లేదన్నారు. పైగా ఏపికి కేంద్రప్రభుత్వం ఏమీ చేయదని తాను చంద్రబాబుకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు గురించి మాట్లాడుతూ, సిఎం కూడా ఏమీ తక్కువ తినలేదన్నారు. నాటకాలాడించటం, డ్రామాలు ఆడించటం, మాటలు చెప్పటం, కుయుక్తులు పన్నటం అన్నీ తెలుసన్నారు. అందుకే నరేంద్రమోడి కూడా ఏపికి ఏమీ చేయటం లేదంటూ స్పష్టంగా చెప్పారు.
మోడికి ప్రధానిగా అర్హత లేదట
గుజరాత్ లో ఒక వర్గం జనాలను హత్యలు చేయించిన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండటం మన ఖర్మ అంటూ మండిపడ్డారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా పెట్టుకుని హత్యలు చేయించిన మోడికి ప్రధానిగా ఉండేందుకు అర్హత లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందంటూ కేంద్రంపై మండిపడ్డారు. గతంలో ఎస్సీ, ఎస్టీలపై ఎవరైనా చేయి వేయాలంటే భయపడేవారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ హయాంలో పోలీసులన్నా, లాఠీలన్నా ఎవరికీ భయం ఉండటం లేదన్నారు. జెసి వ్యాఖ్యలు చేస్తున్నపుడు అక్కడే ఉన్న టిడిపి నేతలు బాగా ఇబ్బంది పడ్డారు. దీక్ష చేస్తున్న రమేష్ , ప్రోత్సహిస్తున్న చంద్రబాబుతో పాటు ప్రధానమంత్రిని కూడా వదలకుండా జెసి చెడుగుడు ఆడేసుకోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు.