రాజకీయంగా రాష్ట్రంలో విచిత్రమైన పరిస్ధితులు కనబడుతున్నాయి. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది కాలముంది. అయితే, వివిధ కారణాలతో ముందస్తు ఎన్నికల హీట్ పెరిగిపోయింది. దాంతో అధికార తెలుగుదేశంపార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన వైసిపిల మధ్య రాజకీయ వేడి బాగా రాజుకుంటోంది. ఎలాగైనా తిరిగి అధికారం నిలుపుకోవాలని చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తుంటే, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరాలనే పట్టుదలతో వైఎస్ జగన్ పాదయాత్ర పేరుతో జనాల్లో తిరుగుతున్నారు.
ముందస్తుపై చంద్రబాబు హెచ్చరికలు
ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందరూ ఎన్నికలకు రెడీగా ఉండాలంటూ చంద్రబాబు చాలా కాలంగా నేతలకు, క్యాడర్ కు చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా మాత్రం కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా తాము మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతామంటూ నారా లోకేష్ చెప్పటంతో పలు సందేహాలు మొదలయ్యాయి. చంద్రబాబేమో ముందస్తు ఎన్నికలకు సిద్దం కావాలని చెబుతుంటే, లోకేష్ మాత్రం అటువంటి ప్రశక్తే లేదని చెప్పటం గమనార్హం.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలంటున్న లోకేష్
అసలు చంద్రబాబు మాటలకు విరుద్దంగా లోకేష్ ఎందుకు ప్రకటన చేయాల్సొచ్చింది ? పార్టీ నేతల సమాచారం ప్రకారం పాదయాత్రతో జగన్ జనాల్లో దూసుకుపోతున్నారు. జనాలు కూడా పాదయాత్ర విషయంలో బాగా స్పందిస్తున్నారు. ఈ అంశమే చంద్రబాబు, లోకేష్ ను బాగా కలవర పరుస్తున్నట్లు సమాచారం. పాదయాత్రకు స్పందిస్తున్న జనాల్లో మళ్ళీ రెండు రకాలు. ఒకటి జగన్ కు అనుకూలం కాగా రెండోది చంద్రబాబుపై వ్యతిరేకత. పై రెండు రకాలు కూడా టిడిపికి నష్టం చేసేవే అనటంలో సందేహం లేదు. పైగా ముందస్తు ఎన్నికలు చంద్రబాబుకు అచ్చిరావనే సెంటిమెంటు కూడా ఉంది. అందుకనే ముందస్తు కన్నా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళితేనే మంచిదని తండ్రి, కొడుకులు అనుకుంటున్నారట.
జగన్ పరిస్దితేంటి ?
ఇక ముందస్తు ఎన్నికలా లేకపోతె షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలా అన్నదాంతో సంబంధం లేకుండా జగన్ పాదయాత్ర మొదలుపెట్టేశారు. రాయలసీమలో ఒక మోస్తరుగా జరిగిన పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించేటప్పటికి ఊపు కనిపించింది. తర్వాత ప్రకాశం జిల్లాలో గేరు మార్చుకుని గుంటూరు, కృష్ణా జిల్లాలతో వేగం పుంజుకుంది. తాజాగా ఉభయగోదావరి జిల్లాల్లోకి ప్రవేశించేనాటికి టాప్ గేరులోకి మారింది. జగన్ కు అనుకూలంగానో లేకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగానో ఎలాగయితే నేమి ? పాదయాత్ర అయితే బ్రహ్మాండంగా నడుస్తోందన్నది వాస్తవం.
పాదయాత్ర వల్ల లాభాలుంటాయా ?
ముందస్తు ఎన్నికలు జరిగితే పాదయాత్ర ప్రభావం టిడిపిపై స్పష్టంగా ప్రభావం కనిపిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఉదాహరణకు 15 సీట్లున్న పశ్చిమగోదావరి జిల్లాలో పోయిన ఎన్నికలో వైసిపికి ఒక్కసీటు కూడా రాలేదు. అటువంటిది పాదయాత్ర ప్రభావంతో ఓ ఐదు సీట్లు గెలుచుకుంటే ఆ మేరకు టిడిపికి నష్టం జరిగినట్లే కదా ? ఆలాగే 14 స్ధానాలున్న అనంతపురం జిల్లాలో పోయిన ఎన్నికల్లో వైసిపి గెలిచింది కేవలం 2 సీట్లే. వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాలో కూడా ఓ ఐదు సీట్లు గెలుచుకుంటే పాదయాత్ర వల్ల వైసిపికి లాభం జరిగిందనే అనుకోవాలి.
ముందస్తుకే జగన్ మొగ్గు ?
ఇదంతా ఎప్పుడు ? ముందస్తు ఎన్నికలు జరిగినపుడే సాధ్యం. అదే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగితే అప్పుడు వైసిపి పరిస్ధితేంటి ? పాదయాత్ర వల్ల జనాల్లో ఇపుడున్న టెంపో అప్పటి వరకూ ఉంటుందా అన్నది చెప్పలేం. ఈలోగా చంద్రబాబు పార్టీకి, ప్రభుత్వానికి జరుగుతున్న డ్యామేజి కంట్రోలుకు ప్రయత్నిస్తారు కదా ? అందుకే ముందస్తు ఎన్నికల కోసం జగన్ ఎదురుచూస్తుంటే చంద్రబాబేమో వ్యతిరేకంగా ఉన్నట్లు అర్దమవుతోంది.