చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ఏపిలో కూటమి ఏర్పడాలని బహిష్కృత తెలగాణా టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు పిలుపిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి, జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీల్లో ఎవరికైనా ఓటు వేయండి కాని చంద్రబాబుకు మాత్రం ఓటు వేయద్దని గట్టిగా అరచి చెప్పారు. మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాయటానికి కూడా ఇబ్బందిగా ఉండే పదజాలాన్ని చంద్రబాబుపై మోత్కుపల్లి పదే పదే ఉపయోగించటం గమనార్హం.
సిఎంగా అర్హత లేదు
చంద్రబాబు పాలనలోని అవినీతి గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటానికి ఏమాత్రం ఆర్హత లేదని కుండబద్దలు కొట్టారు. సిఎంతో పాటు లోకేష్ రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగ దోచుకుతింటున్నారంటూ మండిపడ్డారు. పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ మరణించేటపుడు చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. మోసగాళ్ళకే మోసగాడంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతిమరుపు రోగముందన్నారు.
నమ్మక ద్రోహం చేయటమే నైజం
వాడుకుని వదిలేయటంలో చంద్రబాబుకు మించిన వాళ్ళు లేరన్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. మానవ రూపంలో ఉన్న రాక్షసుడంటూ చంద్రబాబును అభివర్ణించారు. తానెంతో నమ్మకంగా ఉంటే చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారంటూ మండిపడ్డారు. వచ్చే నెల 11వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నట్లు చెప్పిన మోత్కుపల్లి చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణాలో తన్ని తరిమేసిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఏపిలో జనాలు ఘోరి కట్టటం ఖాయమన్నారు.
సిఎం రమేష్ ది దొంగ దీక్షే
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష దొంగ దీక్షగా వర్ణించారు. రమేష్ దీక్ష చేస్తున్న పద్దతిలో అతులేని దీక్ష చేయవచ్చన్నారు. చంద్రబాబు నైజం తెలుసు కాబట్టి రమేష్ కూడా ఎంతో కాలం దీక్ష చేయరంటూ జోస్యం చెప్పారు. రమేష్ జరుగుతున్న దీక్షపై ఎంపి జెసి దివాకర్ రెడ్డి చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజమన్నారు. దీక్షలపై ఎంపిలకు ఎంత చిత్తశుద్ది ఉందో వాళ్లు చేసిన వ్యాఖ్యలతోనే బయటపడిందన్నారు.