ఇప్పటికే ఎన్నో విజయవంతమైన రాకెట్ ప్రయోగాలతో చరిత్ర సృష్టించిన శ్రీహరికోటలోని సతీశ్ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతోంది. స్వదేశీ ఉపగ్రహాల ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎన్నో విజయాలు సాధిస్తుంది. తాజాగా మానవ సహిత రాకెట్ ప్రయోగంపై ఇస్రో దృష్టి సారించింది. ఇందుకోసం శ్రీహారికోటలో గురువారం చేపట్టిన క్రూ ఎస్కేప్ సిస్టం పరిశోధన విజయవంతమైంది. ప్రయోగం అనంతరం షార్కు 3 కిలోమీటర్ల దూరంలోని బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో పారాచుట్ సాయంతో వ్యోమగాములు దిగారు.
ఇస్రో చైర్మన్ శివన్ 300కు పైగా సెన్సార్ల ద్వారా ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. శ్రీహరికోట సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని సౌండింగ్ రాకెట్ ప్రయోగ వేదిక నుంచి ప్రత్యేక ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు నిర్వహించారు. షార్లో రూ.245 కోట్ల వ్యయంతో మల్టీ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ రాడార్ కేంద్రాన్ని నిర్మించి గతేడాది ప్రారంభించారు. ఒకేసారి పది రాకెట్లను ట్రాకింగ్ చేసే సామర్థ్యం కలిగిన ఎంఓటీఆర్ను కూడా ఏర్పాటు చేశారు.
దీంతో ప్రపంచంలో ఎంఓటీఆర్ ఉన్న రెండో దేశంగా భారత్ ఆవిర్భవించింది. ఘన ఇంధనం తయారీకి అవసరమైన వాటిని రూ.226 కోట్లతో నిర్మించేందుకు ఇటీవలే టెండర్ల ప్రక్రియను ముగించారు.రాబోయే పదేళ్లలో ఇక్కడి నుంచే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే ఇస్రోకు గుండెలాంటి షార్ ప్రపంచ స్థాయి రాకెట్ ప్రయోగ కేంద్రంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.
అంతరిక్ష యాత్రలు క్రమేపీ వాణిజ్య స్థాయిని అందుకుంటున్న ప్రస్తుత తరుణంలో వ్యోమగాముల రక్షణపై ప్రయోగం చేసిన ఇస్రో అందులో విజయం సాధించింది. ఈ ప్రయోగం కోసం బుధవారం అర్ధరాత్రి 1.30 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభంకాగా ఈరోజు ఉదయం రాకెట్ను రోదసిలోకి ప్రయోగించి విజయం సాధించారు.