వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు తెలంగాణా కాంగ్రెస్ పార్టీతో సమావేశమయ్యారా ? అవుననే అంటోంది జగన్ మీడియా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహూల్ గాంధి దూతగా రెండు రోజుల క్రితం చంద్రబాబు-తెలంగాణాలోని ఓ ఎంఎల్ఏతో రహస్యంగా భేటీ అయ్యారట. రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిగాయట. పోటీలోకి దింపాల్సిన అభ్యర్ధులు, ఎక్కడి నుండి ఎవరిని పోటీలోకి దింపాలి ? ఎన్నికల్లో అయ్యే ఖర్చు తదితరాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.
పక్కాగా పావులు కదుపుతున్న చంద్రబాబు
జరుగుతున్న ప్రచారం చూస్తుంటే కాంగ్రెస్ తో పొత్తుల విషయంలో చంద్రబాబు చాలా పక్కాగా పావులు కదుపుతున్నట్లు అర్ధమవుతోంది. ఎలాగంటే, కాంగ్రెస్ తో పోటీ చేయబోయే అభ్యర్ధుల్లో కొందరి పేర్లను చంద్రబాబు సదరు ఎంఎల్ఏకు అందచేశారట. అలాగే, టిడిపిలో ఉన్న నేతల్లో కొందరిని కాంగ్రెస్ లోకి పంపి అక్కడి నుండి పోటీలోకి దింపనున్నట్లు కూడా చంద్రబాబు కాంగ్రెస్ కు స్పష్టం చేశారట. అదే విధంగా వైసిపి ఫిరాయింపు ఎంఎల్ఏల్లో కొందరిని కాంగ్రెస్ లో చేర్చుకుని వారికి టిక్కెట్లు ఇవ్వాలని చెప్పారట. చివరగా వైసిపిలోకి చేరిన నేతల్లో కొందరి పేర్లను సూచించిన చంద్రబాబు సదరు నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి రప్పించాలని సూచించారట.
రాహూల్ ఆదేశాలతోనే భేటీ
చంద్రబాబుతో భేటీ తరువాత ఆ వివరాలను సదరు ఎంఎల్ఏ రాహూల్ గాంధికి చేరవేసినట్లు సమాచారం. రాహూల్ తో పాటు సదరు ఎంఎల్ఏ రాహూల్ సలహాదారుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారితో కూడా చర్చించారట. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రెండు పార్టీల మధ్య పొత్తులు ఖాయమని అర్ధమవుతోంది. కాకపోతే ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందన్న విషయమే ఫైనల్ అవ్వాల్సుంది. అదే సందర్భంగా తెలంగాణాలో మాత్రమే పొత్తు పెట్టుకుంటే ఎలాగుంటుందన్న చంద్రబాబు ఆలోచనలో కూడా ఇంకా స్పష్టత రావాల్సుంది. చంద్రబాబేమో తెలంగాణాలో మాత్రమే పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ పొత్తులుండాల్సిందే అని పట్టుబడుతోంది. పై రెండు అంశాల్లో రెండో అంశంపై స్పష్టత వస్తే మొదటి అంశంలో క్లారిటీ వచ్చేస్తుంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు కొత్త మిత్రుడు దొరికేసినట్లే.