చంద్రబాబునాయుడు రాజకీయం గురించి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అవసరానికి ఎన్ని మాటలైనా మాట్లాడుతారు, ఎన్ని వేషాలైనా వేస్తారు. ఆ విషయం ఇపుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇపుడీ ప్రస్తావన ఎందుకంటే చంద్రబాబు ఎంపిలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, ' ప్రత్యేకహోదా అంశంపై తాను ఎప్పుడూ రాజీ పడలేద' ని స్పష్టం చేశారు. పైగా తన మాటలను అందరూ అడ్డంగా వక్రీకరించారి తనపై దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు. అవసరమైనపుడు ప్రజల పక్షాన పోరాడే వారే హీరోలవుతారంటూ చెప్పటం కొసమెరుపు.
మాటల వింటే మతిపోవటం ఖాయం
చంద్రబాబు మాటలు విన్న వారికి నిజంగా మతిపోవటం ఖాయం. బిజెపితో అంటకాగిన నాలుగేళ్ళపాటు చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలే పట్టలేదు. కేంద్రం ఏమంటే దానికి తలూపారు. కేంద్రం నంది అంటే నందని, పందంటే పందని వంత పాడారు. హోదా ఇవ్వనంటే సరే అన్నారు. హోదా స్ధానంలో ప్రత్యేక ప్యాకేజి ఇస్తానంటే సరే అన్నారు. దాంతో రాష్ట్రంలో అసలు ప్రత్యేకహోదా అన్న పదమే వినబడకూడదంటూ ఆదేశించారు.
హోదా అంటే జైలు అన్నదెవరో ?
ప్రత్యేకహోదా డిమాండ్ తో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆందోళనలు చేస్తే అంగీకరించలేదన్న విషయం అందరికీ తెలుసు. హోదా ఆందోళనల్లో ఎవరైనా పాల్గొంటే వారిని జైలుకు పంపిస్తానంటూ తీవ్రంగా చేసిన హెచ్చరికలను ఎవరూ మరచిపోలేదు. హోదా విషయంలో జనాల మనోభావలను నాలుగేళ్ళ తర్వాత గ్రహించిన చంద్రబాబు హటాత్తుగా బిజెపితో కటీఫ్ చేసుకున్నారు. అప్పటి నుండి ప్రత్యేకహోదా కోసం తాను నాలుగేళ్ళుగా పోరాటాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.
అడ్డంగా బుకాయిస్తున్న చంద్రన్న
అసలు చంద్రబాబు ఒప్పుకుంటేనే కేంద్రం ఏపికి ప్యాకేజి ప్రకటించిందని స్వయంగా ప్రధానమంత్రే లోక్ సభలో ప్రకటించారు. అలాంటిది హటాత్తుగా ఎంపిలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు అడ్డంగా బుకాయిస్తున్నారు. ప్రత్యేకహోదాపై తానెపుడూ రాజీపడలేదని చెప్పటం విన్నవారికి అందరికీ మతిపోయింది. నాలుగేళ్ళపాటు హోదా ఆందోళనలపై ఉక్కుపాదం మోపిన విషయం మరచిపోయినట్లున్నారు. హోదా డిమాండ్ పై ప్రజల పక్షాన నిలబడిన వాళ్ళెవరో జనాలకు అంత మాత్రం తెలీకుండానే ఉంటుందా ?