ఒక్కో వ్యక్తికి ఒక్కో వ్యసనం ఉంటుంది. ఎవరికి ఎటువంటి వ్యసనం ఉన్నా అదంతా వ్యక్తిగతం కాబట్టి పక్క వాళ్ళకు ఎటువంటి నష్టం ఉండదు. కానీ చంద్రబాబునాయుడుకు ఉన్న వ్యసనం మాత్రం చాలా ఖరీదైనది. చంద్రబాబు వ్యసనానికి జనాలు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇంతకీ సిఎంకున్న ఆ వ్యసనం ఏమిటని అనుకుంటున్నారా ? అదేలేండి విదేశాలకు వెళ్ళటం, స్ధానికంగా క్యాంపు కార్యాలయలకు షోకులు చేయటం, ఆర్భాటాలు చేయటం . అవును మీరు చదివింది కరెక్టే. విషయం ఏదైనా సరే అవసరమైనదానికన్నా విపరీతంగా ఖర్చులు చేయటమన్నది చంద్రబాబుకు పెద్ద వ్యసనంగా మారిపోయింది.
జనాల డబ్బుతో విదేశీయానాలు, క్యాంపాఫీసులా ?
విదేశాలకు వెళ్ళమంటే మాటలా ? పైగా మందీ మార్బలంతో కలిసి. చంద్రబాబు ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా వెంట మంత్రులు, ఉన్నతాధికారులు, భద్రతాధికారులు ఉండాల్సిందే. మరి అంతమంది విదేశాలకు వెళ్ళటమంటే కోట్ల రూపాయల ఖర్చు తప్పదు. అంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళినపుడల్లా అయ్యే ఖర్చంతా జనాలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బులో నుండే కదా పెట్టేది ? గడచిన నాలుగేళ్ళుగా చంద్రబాబు విదేశీయాత్రలకు వందల కోట్ల రూపాయలు ఖర్చయ్యుంటుదనటంలో సందేహం లేదు. అదే సమయంలో క్యాంపు కార్యాలయాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసేస్తున్నారు. అంతేకాకుండా ప్రతీ చిన్న విషయాన్ని ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు.
విదేశీ ప్రయాణాల వల్ల ఏంటి ఉపయోగం ?
గడచిన నాలుగేళ్ళుగా చంద్రబాబు అండ్ కో కనీసం 20 దేశాల్లో పర్యటించుంటారు. పెట్టుబడులని, రాజధాని నగరాల పరిశీలన అని, రాజధాని నిర్మాణంపై చర్చల పేరుతో సింగపూర్, అమెరికా, లండన్, దుబాయ్, దావోస్ లాంటి అనేక దేశాల్లో తిరిగారు. మందీ మార్బలంతో తాను తిరగటమే కాకుండా మంత్రులు, ఉన్నతాధికారులను కూడా విదేశాల్లో తిప్పారు. అంతమంది అన్ని దేశాల్లో తిరిగినందు వల్ల ఏమన్నా ఉపయోగముందా అంటే ఏమీ కనబడలేదు. పెట్టుబడుల పేరుతో ఒకవైపు విదేశాల్లో తిరుగుతూనే అదే పెట్టుబడుల ఆకర్షణ పేరుతో మళ్ళీ విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తున్నారు. చంద్రబాబు దెబ్బకు రాష్ట్ర జనాల పరిస్ధితి ఒకవైపు గోడదెబ్బ ఇంకోవైపు చెంపదెబ్బ అన్నట్లు తయారైంది.
ఎన్నికల ముందు కూడా విదేశాలకు అవసరమా ?
విదేశాల నుండి, భాగస్వామ్య సదస్సుల ద్వారా వచ్చిన పెట్టుబడుల మొత్తం రూ. 16 లక్షల కోట్లని చంద్రబాబు చెబుతుండగా పరిశ్రమల శాఖ మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. దాన్నిబట్టే అర్ధమవుతోంది చంద్రబాబు లెక్కల్లో నిజమెంతో. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో పెట్టుబడులు పెట్టమని విదేశాలను ఆహ్వానించారంటే అర్ధముంది. నాలుగేళ్ళు పూర్తయి మరికొద్ది నెల్లల్లో ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో కూడా ఇంకా విదేశాలను పెట్టుబడులు పెట్టమని అడుగుతున్నారంటే చంద్రబాబు పరిస్ధితేంటో అర్ధం చేసుకోవచ్చు. ఏదో ఒక పేరుతో విదేశాలకు వెళ్ళటం, అనవసరంగా ప్రజా ధనాన్ని వృధా చేయటం చంద్రబాబుకు వ్యసనంగా మారిపోయిందని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. మరి ఆ వ్యసనం చంద్రబాబును ఎప్పుడు వదులుతుందో ఏమో ?