కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహూల్ గాంధితో చంద్రబాబునాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి భేటీ అయ్యారు. వీరిద్దరు ఎందుకు ఎక్కడ భేటీ అయ్యారని అనుమానం వచ్చిందా ? అవును వీరిద్దరూ భేటీ అయ్యింది నిజమే. రెండు రోజుల తెలంగాణాలో కాంగ్రెస్ అధ్యక్షుని భేటీలో భాగంగా ఈరోజు ఓ హోటల్లో రాహూల్ గాంధి పరిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు టిడిపికి చెందిన పారిశ్రామికవేత్తల వారసులు బాగా ఉత్సాహం చూపారు.
రాహూల్ తో టిడిపి పారిశ్రామికవేత్తలు
ఆ భేటీలో భాగంగానే నారా బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తల సమావేశానికి షెడ్యూల్ కన్నా ముందే బ్రాహ్మణి హోటల్ కు చేరుకున్నారు. వ్యక్తిగతంగా కూడా కలవాలని అనుకుంటున్నట్లు సమాచారం. మరి అవకాశం లభిస్తోందో లేదో తెలీదు. బ్రాహ్మణితో పాటు టిడిపి ఎంపిలు జెసి దివాకర్ రెడ్డి, టిజి వెంకటేష్ కొడుకులు జెసి పవన్ రెడ్డి, టిజి భరత్ కూడా హాజరయ్యారు.
పొత్తులు ఖాయమేనా ?
నిజానికి జెసి పవన్, టిజి భరత్ పేరుకు మాత్రమే పారిశ్రామికవేత్తలు. వారి పూర్తి వ్యాపకమంతా రాజకీయమే అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ బ్రాహ్మణి అలాకాదు. ఆమె పూర్తిస్ధాయి పారిశ్రామికవేత్త. తన పూర్తి కాలాన్ని బ్రాహ్మణి హెరిటేజ్ కార్యకలాపాలకు మాత్రమే కేటాయిస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్-టిడిపిలు పొత్తులతో ఎన్నికలను ఎదుర్కొనటం దాదాపు ఖాయమనే చెప్పాలి. పొత్తులు ఖాయమన్నట్లే రాహూల్, చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్నారు.
పర్ఫెక్ట్ గా జరుగుతున్న సహకారం
మొన్నటి రాజ్యసభ డిప్యుటి ఛైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధికి టిడిపి ఓటేసింది. పార్లమెంటు తరపున పిఏసి మెంబర్ కోసం జరిగిన ఎన్నికలో టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కు కాంగ్రెస్ ఓట్లేసింది. అంటే రెండు పార్టీల మధ్య ఇచ్చిపుచ్చుకునే రీతిలోనే సహకారం సాగుతోంది. కాకపోతే పొత్తల విషయం అధికారికంగా ప్రకటించలేదంతే. ఈ నేపధ్యంలోనే పారిశ్రామికవేత్తల హోదాలో బ్రాహ్మణి తదితరులు రాహూల్ తో సమావేశమవ్వటం ఆలోచించాల్సిందే.
ఏపిలో అధికారం డౌటే !
రానున్న ఎన్నికల్లో ఏపిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం డౌటే అని అంగీకరించారు. మీడియా ఎడిటర్లతో భేటీ సందర్భంగా రాహూల్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ఏపిలో కాంగ్రెస్ పార్టీ పరిస్దితి మెరగవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కానీ తెలంగాణాలో మాత్రం అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఇక, పొత్తుల విషయమై మాట్లాడుతూ, పిసిసి అధ్యక్షులే నిర్ణయం తీసుకుంటారంటూ తెలివిగా సమాధానమిచ్చారు. ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయానికి కాంగ్రెస్ కట్టుబడుందని కూడా రాహూల్ చెప్పటం గమనార్హం.