అవును తెలుగుదేశంపార్టీకి చెందిన సీనియర్ నేత త్వరలో వైసిపిలో చేరటానికి రంగం సిద్దమైందట. టిడిపిలో సీనియర్ నేత, చంద్రబాబునాయుడి సమకాలీకుడు కరణం బలరామ్ తొందరలో వైసిపిలో చేరేందుకు అంతా రెడీ అయ్యిందట. పార్టీలో తనకు వ్యతిరేకంగా పెరిగిపోతున్న వ్యవహారాలపై కరణం ఎప్పటి నుండో మండిపోతున్నారు. అయితే, ఏ వ్యవహారాన్ని కూడా అదుపు చేసే స్ధితిలో లేరు. దాంతో ఇటు పార్టీలో అటు జిల్లాలో ఎక్కడ చూసినా అవమానాలే. దాంతో టిడిపిలో ఇమడలేని పరిస్ధితి. అందుకే తొందరలో టిడిపికి గుడ్ బై చెప్పాలని కరణం నిర్ణయించుకున్నారట.
టిడిపిలో భవిష్యత్తు లేనట్లే
కరణం టిడిపిని వదిలేయాలని అనుకుంటున్న విషయం ఈ నాటిది కాదు. ఈ విషయం ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. కాకపోతే ఈ మధ్యనే వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు, వైసిపిలో కీలక నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి తో కరణం భేటీ అవటంతో ప్రచారం మళ్ళీ ఊపందుకుంది. ఎటూ టిడిపిలో ఇమడలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో పోటీకి ఛాన్స్ కూడా లేదు. పోనీ కొడుకు కరణం వెంకటేష్ కన్నా టిడిపిలో భవిష్యత్తుందా అంటే అదీ సందేహమే. దాంతో ఇక టిడిడిలో ఉండి ఉపయోగం లేదన్నది కరణంకు అర్ధమైపోయింది. పైగా చంద్రబాబు వైఖరి కూడా కరణంను టిడిపి నుండి బయటకు పొమ్మనకుండానే పొగపెడుతున్నట్లుంది.
గొట్టిపాటి ఫిరాయింపుతోనే సమస్య
అసలు సమస్యంతా పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టిడిపిలోకి ఫిరాయించటంతోనే మొదలైంది. కరణం-గొట్టిపాటి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు ఈనాటివి కావు. వీళ్ళిద్దరి ఫ్యాక్షన్ గొడవల వల్ల రెండు వైపుల చాలామందే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా గొట్టిపాటిని చంద్రబాబు టిడిపిలోకి లాక్కున్నారు. విషయం తెలిసి గొట్టిపాటి టిడిపిలోకి తీసుకోవటాన్ని కరణం ఎంత వ్యతిరేకించినా లేకపోయింది. ఎప్పుడైతే గొట్టిపాటి టిడిపిలోకి ఫిరాయించారో అప్పటి నుండే కరణంకు డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ప్రతీ చిన్న విషయంలోనూ గొట్టిపాటి కలగచేసుకుని కరణంను రెచ్చగొడుతున్నారు. దాంతో ప్రతీరోజు ఇద్దరి మధ్య గొడవలే. విషయాలు చంద్రబాబు దగ్గరకు వెళ్ళినా గొట్టిపాటికే మద్దతుగా నిలబడ్డారు. దాంతో కరణంకు సీన్ అర్ధమైపోయింది.
కొడుకు భవిష్యత్తుపైనే ఆందోళన
జిల్లా రాజకీయాల్లో తన కొడుకు వెంకటేష్ భవిష్యత్తుపై కరణంలో ఆందోళన మొదలైంది. టిడిపిలో ఉంటే వెంకటేష్ కు భవిష్యత్తు ఉండదని బలరామ్ కు అర్ధమైపోయింది. గొట్టిపాటి-కరణం విభేదాల్లో రహస్యమేదీ లేదు. అందరి ముందు ఇద్దరు నేతలు చొక్కాలు చించుకుని కొట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ పరిస్ధితుల్లో కరణం దృష్టి వైసిపి వైపు మళ్ళింది. కరణం పరిస్ధితిని గమనించిన వైసిపి నేతలు కూడా సానుకూలంగా స్పందించారు. దాంతో వైసిపి నేతలతో కరణం భేటీ లాంఛనమే అయ్యింది.
ముహూర్తం ఎప్పుడో ?
విషయం జగన్ దాకా వెళ్ళటంతో అక్కడ కూడా సానుకూలమే అయ్యింది. కాకపోతే ఒక కండీషన్ పెట్టారట. కరణం తన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేస్తే వెంటనే వైసిపిలో చేర్చుకోవటానికి అభ్యంతరం లేదని స్పష్టంగా చెప్పారట జగన్. దాంతో కరణం ఊగిసలాటలో ఉన్నారు. వైసిపిలో చేరటం ఖాయమని, అయితే, ఎంఎల్సీ పదవికి రాజీనామా ఎప్పుడన్నదే సస్పెన్స్ అని సమాచారం. రాజీనామాకు ముహూర్తం ఎప్పుడొస్తుందో చూడాల్సిందే .