నిద్ర లేచిందగ్గర నుండి పడుకునేదాకా కేంద్రం డబ్బులు ఇవ్వటం లేదు..ఏపి చాలా కష్టాల్లో ఉంది..కట్టుబట్టలతో మనల్ని తరిమేశారు.. అంటూ జనాల్లో సానుభూతి కోసం ప్రయత్నించే చంద్రబాబునాయుడు చేస్తున్న దుబారాను చూస్తే సామాన్యుల కళ్ళు తిరిగిపోవాల్సిందే. రాష్ట్ర విభజన కారణంగా ప్రభుత్వ ఏర్పాటే రూ. 16 వేల కోట్ల లోటుతో ఏర్పడిందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి లోటు బడ్జెట్లో మొదలైన రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంత జాగ్రత్తగా నడపాలి ? పైగా ఎకనామిక్స్ సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి పిహెచ్ డి కూడా చేసిన వ్యక్తి.
సిఎం అయిన దగ్గర నుండి దుబారానే
చంద్రబాబు ముఖ్యమంత్రైన దగ్గర నుండి ప్రతీ విషయంలోనూ దుబారా చేస్తునే ఉన్నారు. సిఎంగా బాధ్యతలు తీసుకోవటానికి గుంటూరు-విజయవాడ మధ్య జరిగిన బహిరంగ సభతో మొదలైంది చంద్రబాబు దుబారా. హైదరాబాద్ లోని సచివాలయంలోని హెచ్ బ్లాకును సిఎం బ్లాకుగా నిర్ణయించారు. గవర్నర్ ఆమోదంతో మరమ్మత్తులంతా చేయించారు. తర్వాత వాస్తు కోసమంటూ మళ్ళీ మార్పులు చేశారు. తర్వాత ఫైనల్ గా చంద్రబాబు కార్యాలయ ప్రవేశం చేశారు. ఏ బ్లాకులో అంటే ఎల్ బ్లాకులో. హెచ్ బ్లాకులోనే బాధ్యతలు తీసుకుంటారని చెప్పి వాస్తు పేరుతో చేయించిన మార్పులన్నీదండగే అయిపోయింది.
వాస్తులకే రూ. 30 కోట్లు
అదే సమయంలో మళ్ళీ ఎల్ బ్లాకులో వాస్తులని, సౌకర్యాలని మొత్తం మీద సుమారు రూ .30 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంతా చేస్తే ఎల్ బ్లాకులో ఉన్నది కూడా తొమ్మిది నెలలే. ఓటుకునోటు దెబ్బకు అసలు హైదరాబాద్ నే వదిలేసి విజయవాడకు వెళ్ళిపోయారు. అంటే హైదరాబాద్ లోని హెచ్, ఎల్ బ్లాకుల్లో చేసిన ఖర్చంతా దండగే కదా ? అదే సందర్భంగా క్యాంపు కార్యాలయమని, ఇంటిలో సౌకర్యాలపైన పెట్టిన ఖర్చు కూడా వృధానే.
శంకుస్ధాపనలకే రూ. 350 కోట్లు
ఇక తాజాగా జరుగుతున్న ఖర్చుల గురించి చూద్దాం. ప్రతీ నెలా ఒక జిల్లాలో కేంద్రానికి వ్యతిరేకంగా ధర్మపోరాట సభలు పెడుతున్నారు. ఇప్పటి వరకూ ఆ సభలకైన ఖర్చు సుమారు రూ. 52 కోట్లు. అన్ని కోట్లు పెట్టి నిర్వహిస్తున్న సభలతో ఏమి సాధిస్తున్నారో చంద్రబాబుకే తెలియాలి. దీనికి అదనంగా ప్రతీ ఏడాది జరుపుతున్న నవనిర్మాణ దీక్షల ఖర్చు బోనస్. ఎక్కడికెళ్ళినా ప్రత్యేక విమానాలే కదా ? ఆ ఖర్చు సుమారు రూ. 100 కోట్లు. అమరావతి నిర్మాణానికి మోడి వేసిన శంకుస్ధాపన వ్యయం రూ. 250 కోట్లు. తర్వాత మరో మూడు సార్లు వేరే ప్రాంతాల్లో శంకుస్ధాపనలు చేయించేందుకు మరో రూ. 100 కోట్లు. హైదరాబాద్-విజయవాడ మధ్య అధికారుల రాకపోకలకైన ఖర్చు సుమరు రూ. 120 కోట్లట.
పుష్కరాల పేరుతో రూ. 3200 కోట్లా ?
ఇక రాజధాని నిర్మాణ కన్సల్టెన్సీ కోసం పెట్టిన ఖర్చు రూ. 300 కోట్లు. కుటుంబంతో కలిసి హైదరబాద్ లో ఓ హోటల్లో ఉన్నందుకైన ఖర్చు రూ. 30 కోట్లు. ఇక, పుష్కరాల పేరుతో చేసిన దుబారా రూ. 3200 కోట్లట. ఇదే విధంగా జన్మభూమి సభలనీ, పోలవరంలో కార్యక్రమాలని రకరకాల ఖర్చలకు వందల కోట్లు. ఇలా..మొత్తం మీద నాలుగేళ్ళల్లో చంద్రబాబు గారు చేసిన వృధా ఖర్చులు సుమారు రూ. 6 వేల కోట్లంటూ వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా లెక్కలు చెప్పినపుడు అందరూ నోరెళ్ళబెట్టారు.