ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు రాజకీయ నాయకులు నువ్వా అంటే నువ్వా అంటూ గంభీరంగా శాసన సభలో యుద్దం చేసుకునే వారు..వారేవరో ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది..ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఒక సీఎంగా ఉన్న సమయంలో మరొకరు ప్రతిపక్ష హోదాలో ఉండేవారు. వీరిద్దరూ శాసన సభలో ఉంటే చూసే వాళ్లకు ఎంతో ఉత్కంఠత నెలకొనేది. అధికార పక్షాన్ని ముచ్చెమటలు పట్టించడంలో ఇద్దరూ దిట్ట. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
వీరిద్దరూ కూడా కాంగ్రెస్ లో తమ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. అయితే చంద్రబాబు మాత్రం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించినతెలుగు దేశం పార్టీలో చేరి అప్పటి నుంచి నేటి వరకు టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే మొదటి నుంచి చనిపోయే వరకు వైఎస్ రాజశేఖర్ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు పర్యాయాలు కాంగ్రెస్ తరుపు నుంచి సీఎంగా ఎన్నుకోబడిన వైఎస్ ‘రచ్చబండ’ కార్యక్రమానికి వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నేడు ఆయన వర్ధంతి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ ని స్మరించుకున్నారు. 'మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు. చంద్రబాబు, వైయస్ ల మధ్య మంచి స్నేహబంధం ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకే సమయంలో ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చి, తమదైన ముద్ర వేశారు. రాజకీయంగా వీరు మద్య ఎన్నో విభేదాలు ఉన్నా..వ్యక్తిగతంగా ఇద్దరి మద్య మంచి స్నేహసంబంధాలు కొనసాగేవే..కొన్ని ముఖ్య కార్యక్రమాలు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ కనిపించే వారు. వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా తన మిత్రుడిని చంద్రబాబు మరోసారి గుర్తు చేసుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.— N Chandrababu Naidu (@ncbn) September 2, 2018