పోయిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటానికి దోహదపడిన కారణాల్లో అవినీతి చాలా కీలకమైన అంశం. పదేళ్ళు అధికారంలో ఉన్న కారణంగా యూపిఏ ప్రభుత్వంలో 2జి స్పెక్ట్రమ్, నల్లధనం పెరిగిపోవటం, బ్యాంకుల స్కాముల లాంటివి అనేకం వెలుగు చూశాయి. అదే సమయంలో కాంగ్రెస్ అవినీతిపై బిజెపి తరపున నరేంద్రమోడి లాంటి నేతలు బాణాలు ఎక్కుపెట్టారు. తాము అధికారంలోకి వస్తే నల్లధానాన్ని అరికడతామని, విదేశాల్లోని బ్లాక్ మనీని ఇండియాకు తీసుకొస్తమాని, అవినీతి లేని పాలనను అందిస్తామని హామీలిచ్చారు. ఆ హామీలను నమ్మే జనాలు బిజెపికి బ్రహ్మాండమైన మెజారిటి ఇచ్చారు.
సీన్ కట్ చేస్తే, మోడి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అవినీతి తగ్గిందా ? అన్న ప్రశ్న అన్నీ వర్గాల్లోను వినిపిస్తోంది. నాలుగున్నరేళ్ళ పాలనను చూస్తే కేంద్ర ప్రభుత్వంపై ఎక్కడా అవినీతి ఆరోపణలు రాలేదు. ఇపుడిప్పుడే రాఫెల్ యుద్ద విమానాల్లో భారీ అవినీతి జరిగిందని ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధి ఆరోపణలు మొదలుపెట్టారు. అయితే ఆ ఆరోపణలపై కాంగ్రెస్ ఇంకా ఆధారాలను బయటపెట్టలేదు లేండి.
అవినీతిని అరికట్టే ఉద్దేశ్యంతోనే మోడి హటాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అదే విధంగా జిఎస్టిని కూడా అమల్లోకి తెచ్చారు. దేశాభివృద్ధికి మోడి తీసుకున్న ఈ రెండు చర్యలు పెద్ద ప్రయోగాలనే చెప్పాలి. అయితే, ఆ ప్రయోగాలపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఇప్పటి వరకూ నేరుగా మోడి లక్ష్యంగా అవినీతి ఆరోపణలు లేకపోయినా కొందరు నేతలపై మాత్రం అవినీతి ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింథియా పై ఉన్న ఆరోపణలకు లెక్కేలేదు. అదే స్ధాయిలో మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా సిఎం మనోహర్ లాల్ ఖట్టర్ పై ఆరోపణలు బాగా వినబడుతున్నాయి. తనపై ఆరోపణలు లేకుండా చూసుకోవటమే కాకుండా బిజెపి పాలిత ప్రభుత్వాల్లో కూడా ఆరోపణలు లేకుండా చూసుకుంటేనే మోడి ప్రయత్నాలు సఫలమైనట్లు లెక్క. లేకపోతే కాంగ్రెస్ కు బిజెపికి తేడా ఏమీ లేదని జనాలు అనుకుంటారు.