ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును చూసి తెలంగాణ రాజకీయ దిగ్గజం, ఆపద్ధర్మ సీఎం, టీఆర్ ఎస్ అదినేత కేసీఆర్ భయపడుతున్నారా? నిద్రకూడా పట్టడం లేదా? ముందస్తు ముచ్చటకు తెరదీసిన కేసీఆర్.. బాబు వ్యూహంతో చిక్కుల్లో పడిపోవడం ఖాయమని బావిస్తున్నారా? మరో నెలలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బాబు వేసే ఎత్తులకు తాను చిత్తవడం ఖాయమని బెంబేలెత్తుతున్నారా? అంటే.. ప్రస్తుతం తెరమీదికి వస్తున్న చర్చ ఔననే అంటోంది! ఆశ్చర్యంగా అనిపించినా.. తెలంగాణలో ప్రభుత్వాన్ని రద్దు చేసిన సమయానికి ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. అప్పట్లో ఉన్న ధీమా కానీ, అప్పట్లో ఉన్న భరోసా కానీ, ఇప్పుడు కేసీఆర్లో కనిపించడం లేదని చెబుతున్నారు.
నిజానికి తెలంగాణా నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. ఏపీపైనే కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఏపీలోని పాలనపైనే ఆయన పుంజుకుంటున్నారు. ఇక్కడి విపక్షం వైసీపీని దెబ్బకొట్టేందుకు రోజుకో వ్యూహంతో.. రోజుకో ప్రజా పథకంతో ఆయన దూసుకుపోతున్నారు. గడిచిన నాలుగేళ్లుగా తెలంగాణ రాజకీయలను కూడా బాబు పట్టించుకోవడం లేదు. అక్కడ ఏంజరిగినా కూడా చూస్తూ కూర్చున్నారు. అంతేకాదు, 2014లో తన పార్టీ జెండాపై గెలిచిన వారు చాలా మంది అధికార టీఆర్ ఎస్లోకి జంప్ చేసినా కూడా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా మౌనంగానే ఉండిపోయారు. ఇక, ఇటీవల ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని కేసీఆర్ ముందస్తుకు వెళ్లినప్పుడు కూడా తెలంగాణ రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోనని చెప్పారు.
కనీసం ప్రచారానికి కూడా తాను రానని అక్కడి నాయకులకు తెగేసి చెప్పారు. అంతేకాకుండా స్థానిక టీడీపీ నాయకులు ఎవరితో పొత్తు పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. మరి ఇంతలా చంద్రబాబు తెలంగాణ రాజకీయా లను పక్కన పెట్టినా కూడా కేసీఆర్ మాత్రం బాబును టార్గెట్ చేయడం గమనార్హం. తాను తలుచుకుంటే బాబుకు చుక్కలు చూపిస్తానని తాజాగా నల్గొండ సభ వేదికగా హెచ్చరించడం రాజకీయ నేతలను విస్మయానికి గురి చేసింది.
వాస్తవానికి తెలంగాణాలో టీడీపీ లేదని, అది ఏనాడో చచ్చిపోయిందని చెప్పిన ఇదే కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఇప్పుడు ఎందుకు ఇంతలా కామెంట్లు చేస్తున్నారు? అనేది ప్రధాన ప్రశ్న. చంద్రబాబు హవా లేనప్పుడు ఆయన గురించి కేసీఆర్ మాట్లాడకుండా ఉండడమే మేలు. కానీ, మహాకూటమి పేరుతో చంద్రబాబు తెలంగాణ రాజకీయాలను ఏపీ నుంచే శాసిస్తున్నారని ఆయన అంటున్నారు. అయినా.. ఎందరినో చూసిన కేసీఆర్.. ఇలా బాబును టార్గెట్ చేయడం, ఆయనను విమర్శించడంబాగోలేదని అంటున్నారు పరిశీలకులు.