రాష్ట్రంలో రాజకీయంగాకానీ, మరేవిధంగా కానీ.. ఏం జరిగినా.. ప్రభుత్వాధినేత, టీడీపీ అధినేత.. చంద్రబాబు ఉలిక్కి పడు తున్నారు. మరో ఆరేడు మాసాల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో... ప్రజలు యూటర్న్ తీసుకుంటారా? తనతోనే కలిసి ఉంటారా? అనే విషయాలపై ఆయనకు క్లారిటీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విషయంలోకి వెళ్తే.. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారు. జనసేన, వైసీపీ, టీడీపీల మధ్య త్రిముఖ పోటీ కూడా ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో మరింత బలంగాటీడీపీతో ఢీ అంటే ఢీ అనే రేంజ్లో జగన్ దూసుకు పో తున్నాడనేది వాస్తవం. తాడో పేడో తేల్చుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారు.
అదేవిధంగా తనకు సీఎం పదవి అక్కరలేదని పవన్ అంటున్నాడు. కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబును మాత్రం మట్టికరిపించి తీరుతానని చెబుతున్నారు. ఆయనను ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఎన్నికల్లో ఓడించే వరకు తాను నిద్రపోయేది లేదని అంటున్నారు. ఇక, వైసీపీ అధినేత ఆది నుంచి చెబుతున్నట్టుగానే ఆయన వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తాను వస్తానని ఎక్కడికెళ్లినా చెబుతున్నారు. మొత్తానికి ఈ పరిణామాలు చంద్రబాబుకు తీవ్ర ఇబ్బంది కరంగానే ఉంటున్నాయి. ఇక, రాజకీయ వ్యూహాలు, వ్యాఖ్యల విషయాన్ని పక్కన పెడితే.. అటు వైసీపీ అధినేత జగన్ కానీ, ఇటు పవన్ కానీ రాష్ట్రంలో పర్యటిస్తూ.. సభలను నిర్వహిస్తున్నారు.
అయితే, వీటికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇప్పుడు ఈ విషయమే చంద్రబాబుకు చెమటలు పట్టిస్తోంది. తన ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్నీ చేస్తున్నప్పటికీ.. జగన్ సభలకు, పవన్ సభలకు కూడా జనాలు ఎందుకు క్యూ కడుతున్నారనేది చంద్రబాబు ప్రశ్న. అంతేకాదు, పవన్ కన్నా.. జగన్ సభలకు జనాలు క్యూ కడుతున్నారు. ఇలా ఏ నియోజకవర్గంలో అయితే.. జనాలు జగన్ సభలకు పోటెత్తుతున్నారో.. ఆయా నియోజకవర్గాలటీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ ఇస్తున్నారు. ముఖ్యంగా జగన్ పార్టీకి ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో కూడా ఆ పార్టీ నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రలకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు.
దీనిపై దృష్టి పెట్టిన చంద్రబాబు ఆయా నియోజకవర్గాల టీడీపీ బాధ్యులు సహా టీడీపీ ఎంపీల నుంచి కూడా నివేదికలు తెప్పించుకుని ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తున్నారు. అంత మంది జనాలు ఎలా వచ్చారు? మన సభలకు ఎందుకు రావడం లేదు? సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా అమలవుతున్నాయా? మీరు నియోజకవర్గంలో ప్రజల్లో కలుస్తున్నారా? వంటి ప్రశ్నలతో వేధిస్తున్నారని తాజాగా వెలుగు చూసింది. దీంతో మరీ ఇంత ఖంగారెందుకు బాబు- అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.