రాష్ట్ర రాజకీయాలు వడి వడిగా మారుతున్నాయి. ఇప్పుడున్న పరిస్తితి మరో గంటకు ఎలా మారుతుందో చెప్పడం కష్టంగా మారింది. వచ్చే ఎన్నికలు కీలకం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒకప క్క వైసీపీ ని నిలువరించడం, మరోపక్క జనసేనాని హవాను తట్టుకుని ముందుకు సాగడం వంటి పరిణామాలు బాబుకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ఆయన ఏక్షణాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్తితి ఏర్పడింది. అయితే, బాబు తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ పార్టీని, ఆయనను నమ్ముకుని వైసీపీ తరఫున గెలిచి కూడా టీడీపీలోకి జంప్ చేసిన నాయకులకు చెమటలు పడుతున్నాయి.
తమ భవిష్యత్తు ఏమవుతుందోనని నాయకులు బెంబేలెత్తుతున్నారు. సరే! ఇతర నాయకుల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వ్యవహారం మాత్రం ఆమెకు కన్నీరు పె ట్టిస్తోంది. గత ఎన్నికల్లో ఆమెను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి.. గౌరవించి.. పాడేరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు వైసీపీ అధి నేత జగన్. గిరిజన ఎమ్మెల్యే కావడంతో ఆమెకు పార్టీలోనూ కీలక గౌరవం దక్కేలా చూశారు. అసెంబ్లీలోనూ మిగిలిన నాయకులకు మాట్లాడే అవకాశం వచ్చినా రాకపోయినా.. ఈశ్వరికి మాత్రం ఛాన్స్ ఇప్పించేలా చూడాలని అప్పటి వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ ఇంచార్జిగా ఉన్న జ్యోతుల నెహ్రూను పలుమార్లు జగన్ ఆదేశించారు. పలితంగా ఈశ్వరికి అసెంబ్లీలోనూ గుర్తింపు దక్కింది.
అయితే, ఆమె అనూహ్యంగా జగన్కు జల్లకొట్టి టీడీపీలోకి చేరిపోయారు. తనకు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఖాయమని ఆమె నమ్మారు. కుదిరితే.. మంత్రి పదవి.. లేకుండా చైర్మన్ అని కూడా ఆమె స్వయంగా తన అనుచరులను కూర్చోబెట్టుకుని చెప్పారు. కానీ, వైసీపీ నుంచి వచ్చే వరకు బాగానే రియాక్ట్ అయిన చంద్రబాబు అనంతరం ఆమెకు ప్రాధాన్యం తగ్గించేశారు. ఆమె కు మంత్రి పదవి కాదుకదా.. కనీసం చైర్మన్ గిరీ కూడా ఇవ్వలేదు. మరో ఆరు మాసాల్లోనేఎన్నికలు ఉన్న నేపథ్యంలొ ఇప్పుడు ఇచ్చి కూడా ప్రయోజనం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పరిస్తితి ఇలా ఇప్పటికే ఇలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్-టీడీపీల పొత్తు గిడ్డి నెత్తిన మరో పిడిగు పడేలా చేసింది. కాంగ్రెస్ తో పొత్తు వల్ల పాడేరులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి మణికుమారి బలంగా ఉన్నారు. ఆమెను కాదని గిడ్డికి టికెట్ ఇస్తారా లేదా అన్న టెన్షన్ ఆమెలో మొదలైందట.. బాబు రాజకీయాల కోసం త్యాగం చేయాలన్న మాటను విని గిడ్డి ఈశ్వరీ ఆందోళనగా ఉన్నారట.. మాజీ మంత్రి బాలరాజు కూడా పాడేరుపై కన్నేయడంతో ఈ సీటు కాంగ్రెస్ కు వదిలేయాలని దాదాపు టీడీపీ డిసైడ్ అయినట్టు వార్తలొస్తున్నాయి. అదే జరిగితే ఎన్నో ఆశలతో పార్టీ మారిన గిడ్డి ఈశ్వరీ రాజకీయ భవిష్యత్ కనుమరుగవడం ఖాయంగా కనిపిస్తోంది.