గొల్లపల్లి సూర్యారావు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014లో ఎన్నికైన టీడీపీ నాయకుడు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాజోలును ఎస్సీ నియోజకవర్గంగా మార్చారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్, మరోసారిటీడీపీ అధికారాన్ని పంచుకున్నాయి. గత 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి బరిలోకి దిగిన గొల్లపల్లికి.. మంచి మెజారిటీనే వచ్చింది. వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బొంతు రాజేశ్వరరావుపై దాదాపు 4 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గొల్లపల్లి విజయం సాధించారు. దీంతో ఇక్కడి ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా రు.
వాస్తవానికి గొల్లపల్లి.. చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు కావడంతో ఆయన తమకు ఏదో చేస్తారని ఇక్కడి ప్రజలు భావించారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు.. గొల్లపల్లి సూర్యారావు సీనియార్టీని గుర్తించి.. ఆయనకు అసెంబ్లీ వ్యవహారాల క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ చైర్మన్గా నియమించారు. దీంతో గొల్లపల్లి ఇక, విపక్షంపై విరుచుకుపడడమే తన పదవికి పరమార్ధ మని భావించారు. అసెంబ్లీలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా.. ఆయన ప్రతిపక్షం వైసీపీపై చర్యలు తీసుకునేందుకు ముందుంటారనే పేరు తెచ్చుకున్నారు. అదేసమయంలో నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించాలనే ఊపు మాత్రం ఆయనలో ఎక్కడా కనిపించక పోవడం గమనార్హం.
దీనికి ప్రధాన కారణం.. ఆయనకు నికరంగా ఓ నియోజకవర్గం అంటూ లేదు. గొల్లపల్లి ఎక్కడనుంచి పోటీ చేయమన్నా చిన్న ఆలోచన కూడా లేకుండానే ఆయన పోటీకి రెడీ అయిపోతారు. ప్రస్తుతం గొల్లపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజోలు నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా ఉండడం గమనార్హం. ఇక్కడ ఉపాది దొరకక చాలా మంది రైతు కుటుంబాలు వేరే ప్రాంతాలకు వలసపోతున్నాయి. గెయి ల్ సహా వివిధ సంస్థల వల్ల ఉత్పత్తి అవుతున్న రసాయనాల కారణంగా ఇక్కడి చెరువులు, పొలాలు కూడా కలుషితంగా మారి.. ఇబ్బంది పడుతున్నా. వీరికి ఉపాది కల్పించడంలో మాత్రం గొల్లపల్లి ఫెయిల్ అయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది.
తనకు ఏమీ పట్టనట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నారని అంటున్నారు ఇక్కడి ప్రజలు. సామాజిక పింఛన్లను రాయించుకునేందుకు కూడా ఇక్కడికి ఎవరూ రావడంలేదని, ప్రభుత్వ పథకాలు కూడా సరిగా అమలు కావడంలేదని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. అయినా కూడా గొల్లపల్లి ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాకపోతే.. మరో చోట నిలబడి గెలుస్తాననే ధీమా వల్లే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.