ప్రత్యర్థులు ఏ విషయాన్నయినా.. తమకు అనుకూలంగా మలుచుకునే రాజకీయాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఏ చిన్న అవ కాశం వచ్చినా ప్రత్యర్థులు విడిచి పెట్టరన్న విషయం తెలిసిందే. ప్రధానంగా టీఆర్ ఎస్ అయితే.. ఏ అవకాశం దొరుకుతుందా? అని వెయ్యిక ళ్లతో ఎదురు చూసి.. ప్రజల్లో ప్రత్యర్థులను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇక, ఇప్పుడు తెలంగాణాలో హోరా హోరీ పోరుకు తెరలేచిన నేపథ్యంలో.. నేతల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. అయితే, ప్రత్యర్థులు బలంగా ఉంటే.. మరిన్ని అవకాశాలు, అంతరాల కోసం అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణాలో కీలక నియోజకవర్గం పెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన కూకట్ పల్లి నుంచి మహాకూటమి అభ్యర్థినిగా టీడీపీ నుంచి నందమూరి సుహాసిని పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ బలమైన నాయకుడిగా ఉన్న పెద్దిరెడ్డి తనకు టికెట్ లభించకపోవడంతో కినుక వహించి తెరమరుగయ్యారు. ఈ క్రమంలో పార్టీ కేడర్ కూడా పెద్ద రెడ్డికే జై అంటా మని భీష్మించారు. దీనిని తనకు అడ్వాంటేజ్గా తీసుకున్న టీఆర్ ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు.. సుహాసినితో ఓ ఆట ఆడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా.. కేడర్ కూడా సహకరించని నాయకురాలు కూడా ఓ నాయకురాలేనా? అని ఆయన ప్రశ్నిస్తూ.. కాదు.. కాదు.. అని ప్రజలతోనే చెప్పిస్తున్నారు.
ఇక, తాను తెలంగాణా బిడ్డను అని ఆమె చెప్పుకోవడాన్ని కూడా మాధవరం ప్రశ్నిస్తున్నారు. ఏ ఉద్యమంలో ఆమె తెలంగాణా బిడ్డగా వేలు పెట్టిందో చెప్పాలని సవాలు రువ్వుతున్నారు. కనీసం తెలంగాణాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో కూడా తెలియని నాయకురాలు తెలంగాణా బిడ్డ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ నిజానికి సుహాసినికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వ్యూహ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పైగా. తన మేనమామ చంద్రబాబు కోరిక మేరకు తాను ఇక్కడ పోటీ చేస్తున్నానని తొలిరోజు ప్రకటించి మరింత తప్పు చేశారని అంటున్నారు విశ్లేషకులు. అంటే.. తెలంగాణా అభివృద్ధిపై ఏ మాత్రమూ చిత్తశుద్ధి లేని ఓ నాయకురాలని ఎలా గెలిపించాలని అంటున్నారు. ఇక, ఇప్పుడు సుహాసినికి మరో చింత పట్టుకుంది.
ఆమె పోటీ చేస్తన్నది కూకట్ పల్లిలో అయితే.. ఆమెకు మాత్రం ఓటు హక్కు ఇక్కడ లేదు. తాజాగా మాధవరావు ఇదే విషయంపై ప్రచారం రక్తి కట్టిస్తున్నారు. తెలంగాణా బిడ్డకు ఇక్కడ ఓటు లేదు.. కానీ.. ఇక్కడ మాత్రం సేవ చేస్తుంది! అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సుహాసిని నివాసం మాసాబ్ట్యాంక్ ఎన్ఎండీసీ సమీపంలో ఉంది. ఆమె ఓటు నాంపల్లి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. దీనిని మాధవరం తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో నందమూరి సుహాసినిని గెలిపించుకోవాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆమెకు ఇప్పటికైనా సరైన గైడెన్స్.. మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు పరిశీలకులు. ఎన్నికలకు మరో 13 రోజులు మాత్రమే గడువు ఉండడంతో పరిస్థితిని చక్కదిద్దాలని టీడీపీ అభిమానులు సైతం కోరుతున్నారు.,