ఏపీ రాజధాని గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించిన తాడికొండలో అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ కు సెగ తగులుతోంది. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమేనని వినిపిస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఇక్కడి పరిస్థితి ఏంటని.. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు సర్వే చేయించారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. తెనాలి శ్రావణ్కు ఇక్కడి కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు ఎర్త్ పెడుతున్నారని అంటున్నారు. నిజానికి శ్రావణ్ కుమార్.. శ్రావణ కుమారుడు అంతటి సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటివివాదాలకూ తావులేకుండా ఆయన ముందుకు సాగుతున్నారు.
అయితే, ఆయన వీక్ నెస్ ఏంటంటే..ఏ వర్గానికీ కొమ్ము కాయకపోవడమే! అయితే, ఇక్కడ కమ్మ వర్గానికి చెందిన నాయకులు తమ ఆధిపత్యం పెరగాలని, తాము చెప్పినట్టే అన్నీ జరగాలని వారు భావిస్తున్నారు. ఈ సమయంలో శ్రావణ్కు వ్యతిరేకంగా వారు పావులు కదుపుతున్నారు. తాడికొండలో కమ్మ వర్గానికి చెందిన టీడీపీ నాయకులు లేవనెత్తుతున్న ప్రధాన విషయం.. గత ఎన్నికల ముందు నాటి పరిస్తితి. అప్పట్లో ఇక్కడ పరిస్థితి టీడీపీకి అనుకూలంగా లేదని, కానీ, తాము ఇక్కడ టీడీపీకి అనుకూలంగా పరిస్తితులు మారేలా .. వ్యవహరించామని, ప్రతిఇంటికీ వెళ్లి టీడీపీ ఎందుకు గెలవాలో కూడా వివరించామని, అదే సమయంలో తెనాలికి ఆర్థికంగా కూడా సాయం చేశామని, ఆయన గెలిచేందుకు వ్యూహాత్మకంగా తాము వ్యవహరించామన్నది వారి వాదన.
అయితే, ఆయన తాను గెలిచిన తర్వాత కమ్మ వర్గాన్ని దూరం పెట్టారని, ముఖ్యంగా పార్టీలోని కమ్మ సామాజిక వర్గాన్ని ఏ మాత్రం సంప్రతించకుండానే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ముఖ్యంగా రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు రైతలు నుంచి భూములు తీసుకునన్న తీసుకున్న క్రమంలో దీనిని వ్యతిరేకిస్తూ.. వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారని చెబుతున్నారు. అయితే, ఆయా విమర్శలను ఎమ్మెల్యేగా తెనాలి ఖండించక పోగా.. రైతుల పక్షాన ఆయన కూడా ఇంత భూమి అవసరం లేదని చెప్పడం పార్టీకి పరువు పోయినంత పనిగా మారిందని చెప్పుకొస్తున్నారు. పార్టీకి చేసిన డ్యామేజీని పూడ్చేందుకు చర్యలు తీసుకోకపోగా.. లోపాయికారీగా వైసీపీ నేతలతో జట్టుకట్టి.. ఎస్సీవర్గాలకు కూడా ఆయన చేసింది ఏమీలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయనను తప్పించాలని. మీరు ఎవరికి సీటు కేటాయించినా సహకరిస్తామని, కానీ, శ్రావణ్కు మాత్రం వద్దని ఇక్కడి కమ్మ వర్గం పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది.
ఇదే విషయంపై చంద్రబాబుకు కూడా కొందరు నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో బాబు .ఇక్కడ నిర్వహించిన నిఘా సర్వేలో శ్రావణ్కు తక్కువ మార్కులు పడినట్టు తెలిసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కమ్మ వర్గం కోరుకున్న వారు లేదా.. వారు మద్దతిస్తున్న నాయకుడిని దింపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిని శ్రావణ్ ఖండిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని, తాను అందరినీ కలుపుకొని పోతున్నానని, అయితే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలని కాంట్రాక్టులు తమ వారికే ఇప్పించాలని కొందరు తనపై ఒత్తిడి తెస్తున్నారని, దీనిని తాను అంగీకరించనందునే ఇలా చేస్తున్నారని అంటున్నారు. దీంతో ఇక్కడి రాజకీయం రసకందాయంగా మారింది. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.