నవంబర్ 25 నుంచి 29 తేదీల మధ్య "సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ — సిపిఎస్" తెలంగాణాలోని 119 నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయసేకరణ చేసింది. అభ్యర్థి, పార్టీని లెక్కలోకి తీసుకొని ఈ అభిప్రాయ సేకరణ చేశారు. సీపీఎస్ మొత్తం 2,86,567 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. 2009 అసెంబ్లీ ఎన్నికలు, గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సీపీఎస్ ఇచ్చిన ఫలితాలు నూటికి నూరుశాతం నిజమయ్యాయి.
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఎదురు లేదని సర్వే తేల్చి చెప్పింది. సీపీఎస్ సర్వేలో టీఆర్ఎస్ పార్టీ సీట్ల సంఖ్య 100కు పైగా దాటింది. టీఆర్ఎస్ పార్టీకి 94 నుంచి 104 వస్తాయని 49.7 శాతం ఓట్లు పోలవుతాయని సర్వే తెలిపింది. ప్రజా కూటమి 32.3 శాతం ఓట్లతో 16 నుంచి 21 స్థానాలకే పరిమితమవుతుందని సర్వే తెలిపింది. మజ్లీస్ 2.4 శాతం ఓట్లతో తన ఏడు స్థానాలను తిరిగి గెలుచుకుంటుంది. బీజేపీకి 9.1 శాతం ఓట్లతో 1 నుంచి 2 సీట్లు, ఇతరులు 6.5 శాతం ఓట్లతో ఒక్క స్థానం గెలిచే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఘన విజయం సాధిస్తుందని ఈ తాజా ప్రీ పోల్ సర్వే పైవిధంగా తేల్చింది. సిపిఎస్ నిర్వహించన ఈ ప్రీ పోల్ సర్వే ఫలితాలను ప్రముఖ తెలుగు టీవీ చానెల్ టీవీ 9 సోమవారం సాయంత్రం ప్రసారం చేసింది. దానిపై చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.