తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ మరోసారి తిరుగులేని మెజారిటీతో ఘన విజయం సాధిస్తోందని పలు జాతీయ మీడియా సంస్థలు స్పష్టం చేశాయి. అయితే ఆంధ్రా ఆక్టోపస్గా పేరున్న లగడపాటి రాజగోపాల్ సర్వే మాత్రం జాతీయ మీడియా సంస్థలకు భిన్నంగా జరిగింది. జాతీయ మీడియా సంస్థలన్నీ టీఆర్ఎస్కు 65 నుంచి 90 వరకు సీట్లు వస్తాయని లెక్కలు వేసాయి. రాజగోపాల్ మాత్రం మహాకూటమి 55 సీట్లు ప్లస్ ఆర్ మైనెస్ సాధిస్తుందని.... అలాగే టీఆర్ఎస్కు 35 ప్లస్ ఆర్ మైనస్ మధ్య సీట్లు వస్తాయని చెప్పిన సంగతి తెలిసిందే. 2005 నుంచి లగడపాటి వెల్లడిస్తున్న సర్వేలు నూటికి నూరు శాతం నిజం అవుతున్నాయి. దీంతో చాలా మంది జాతీయ మీడియా సంస్థలు చెప్పిన సర్వేలను సైతం సందేహించి లగడపాటి సర్వేపై ఆసక్తి కనపరిచారు.
అయితే తాజాగా జరుగుతున్న కౌంటింగ్లో కారు జోరుకు బ్రేకులు లేకుండా ఉన్నాయి. ప్రస్తుతం కారు స్పీడు చూస్తుంటే 80 నుంచి 90 స్థానాల్లో సులువుగానే విజయం సాధించేలా కనిపిస్తోంది. లగడపాటి అంచనాలు తెలంగాణ ఎన్నికల విషయంలో తప్పినట్టు స్పష్టంగా తెలుస్తోంది. టీఆర్ఎస్కు ఏకంగా 80 నుంచి 90 సీట్ల మధ్యలో స్పష్టమైన మెజారిటీ... ఇంకా చెప్పాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీని ఆ పార్టీ క్రాస్ చేసేలా కనిపిస్తోంది. లగడపాటి సర్వే ఇక్కడ పూర్తిగా రివర్స్ అయ్యింది. రాజగోపాల్ సర్వే తారుమారు కావడంతో సోషల్ మీడియాలో అప్పుడే ఆయన్ను టార్గెట్ చేస్తు ట్రోలింగ్ మొదలైంది.
ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో కమెడియన్లు చెప్పిన డైలాగ్ ట్రోల్ చేస్తూ ఆకు తింటావా నాయనా అంటూ ఆయన్ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. లగడపాటి ఈ సారి ప్రజలను మోసం చేసారని ఆయన ఖచ్చితత్వాన్ని కోల్పోయారని ఫైర్ అవుతున్నారు. మరి కొందరు మాత్రం లగడపాటిపై కొంతమంది మీడియా అధినేతలు, ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చి సర్వేను మార్పించారని విమర్శలు చేస్తున్నారు. లగడపాటి సర్వేలపై కేసీఆర్, కేటీఆర్ సైతం మండిపడిన సంగతి తెలిసిందే. ముందు నుంచి కేసీఆర్, తెలంగాణ నాయకులు ఏదైతే చెబుతున్నారో అదే స్థాయిలో టీఆర్ఎస్ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోవడంతో లగడపాటి సర్వే పూర్తిగా రివర్స్ అయ్యింది.