ప్రజల్లో జగన్ ... ఈ నాలుగేళ్లు జగన్ ఏం సాధించాడు ...!
జగన్ 2014 ఎన్నికల్లో సీఎం అయిపోతాడని జాతీయ మీడియా లు కోడై కూశాయి. నోటి దాకా వచ్చిన సీఎం కుర్చీ అందకుండా పోయింది. అయితే గత ఎన్నికలకు ముందు జగన్ అంటే.. ఒకరకమైన అంతఃపురానికి మాత్రమే ఎరిగినవాడు. గత నాలుగేళ్లలో మాత్రం జగన్ అంతఃపురం దాటి వచ్చి.. తనను తను ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. గత ఎన్నికల ముందు జగన్ కేవలం ఒక ప్రత్యామ్నాయం. తెలుగుదేశం పార్టీ పాలనవద్దు.. చంద్రబాబు వద్దు.. కాంగ్రెస్ వద్దు.. అనుకున్న వాళ్లకు, వైఎస్ మీద అభిమానంతో ఉన్న వాళ్లకు జగన్ ఒక ప్రత్యామ్నాయం. ఆ ప్రత్యామ్నాయం అనే అంతమంది జగన్కు ఓటేశారు . కేవలం జగన్ను చూసి ఓటేశారప్పుడు.
జగనంటే ఏమిటో అలా ఓట్లేసిన వారికి కూడా పూర్తిగా తెలీదప్పటికి! జగన్ మీద అప్పటికే చాలా ముద్రలు వేశారు వైరివర్గాల వారు. అవినీతిపరుడు, పదహారు నెలలు జైల్లో ఉన్నాడు.. లక్షకోట్లు దోచుకున్నాడు.. అంటూ జనాలను రుద్దింది వ్యతిరేక వర్గం. వాళ్లు అంతచేసినా.. చంద్రబాబుకు జగన్కు మధ్య తేడా కేవలం ఐదున్నర లక్షల ఓట్లు. అది కూడా చంద్రబాబు బలంలో బీజేపీ, పవన్ కల్యాణ్ల బలం మిళితం అయ్యింది. అక్కడకూ జగన్ మరి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే.. అప్పుడు వైసీపీ వర్గాలు అతివిశ్వాసానికి పోకుంటే.. గడిచిన నాలుగున్నరేళ్లూ మరోరకంగా ఉండేవి.
అయితేనేం.. ప్రతిపక్షంలో ఉన్నా జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా చిన్నబోలేదు. తననుతాను ప్రజలముందు ఆవిష్కరించుకున్నాడు జగన్. తనమీద అంతకు ముందున్న ప్రచారాలను నమ్మాలో వద్దో ప్రజలకు అర్థమయ్యేలా చేశాడు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో తన వైరివర్గాలే అధికారంలో ఉన్నా.. తను దోచుకున్నది అంటున్న లక్షకోట్ల రూపాయల్లో ఎంత ఉందో నిరూపించారో అందరికీ తెలిసిందే. జగన్కు అహకారం, జగన్కు పొగరు.. అని విషప్రచారం చేసిన వాళ్లకూ జగన్ ఏడాదిగా జనం మధ్యన ఉంటూ సమాధానం ఇస్తూనే ఉన్నాడు.