రోజు రోజుకి వైసీపీ పార్టీకి పెరుగుతున్న సినీ గ్లామర్..!
ప్రస్తుతం వైసీపీ పార్టీ రాష్ట్రంలో చూస్తే మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని అన్ని సర్వేల ఫలితాలు తెలియజేస్తున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వైసిపి పార్టీకి రోజురోజుకి సినీ గ్లామర్ పెరుగుతోంది. టాలీవుడ్ నుంచి పలువురు నటులు వైసీపీ తీర్థం పుచ్చుకుని జగన్ వెంట నడుస్తున్నారు.
తెర వెనుక కూడా సినీ నటులు జగన్కు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా మరో సీనియర్ నటుడు భానుచందర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఇచ్చాపురంలో ముగియనుంది. ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ఇచ్చాపురం చేరుకున్న భానుచందర్ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వైసీపీ కండువా కప్పి భానుచందర్ ను పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా జగన్ పాదయాత్ర పై ప్రశంసల వర్షం కురిపించారు భానుచందర్. కచ్చితంగా రానున్న రోజుల్లో వైసీపీ అధినేత జగన్ చరిత్ర సృష్టిస్తారని..దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా పేద ప్రజలకు అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భానుచందర్.